హైదరాబాద్ నగరంలో పార్కులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. జోన్ల వారిగా వివిధ రకాల పార్కులను అభివృద్ది చేస్తోంది. అందులో భాగంగా దోమలగూడలోని ఇందిరా పార్కులో ఒక ఎకరం విస్తీర్ణంలో పంచతత్వ ఆక్యూప్రెజర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేస్తోంది. దాదాపు 80శాతం పనులు పూర్తి అయ్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆక్యూప్రెజర్ (శరీరంపై ఒత్తిడి కలిగించు) పద్దతిలో ఎనిమిది అంశాలతో ఈ పార్కును నిర్మిస్తున్నారు. ట్రాక్ పై నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న నరాలపై వివిధ స్థాయిలో ఒత్తిడిని కలిగించే పద్దతిలో 20 మిల్లీ మీటర్లు, 10 మిల్లీ మీటర్ల రాళ్లు, నది రాళ్లు, 6 మిల్లీమీటర్ కంకర, ఇసుక, చెట్ల బెరడు, నల్లరేగడి మట్టి, నీటి బ్లాక్లను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్ను నిర్మించారు. ఈ సర్కిల్కు అన్ని వైపులా 40 రకాల వైద్య, హెర్బల్ ప్లాంట్స్ను బ్లాక్లుగా ఏర్పాటు చేశారు. మొదటగా నరాలపై అధిక ఒత్తిడి కలిగించే ట్రాక్ నుంచి క్రమ పద్దతిలో ఒత్తిడి తగ్గించే ట్రాక్ వైపు నడవటం వల్ల రక్తప్రసరణలో సానుకూల మార్పు జరిగి వివిధ రకాల అనారోగ్యాలు దూరమవుతాయి. ఈ పార్కు మధ్యలో గౌతమ బుద్దుడి విగ్రహాన్ని నెలకొల్పారు.