ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల తల్లి అకౌంట్కే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. ప్రతి త్రైమాసికం పూర్తయిన తరువాత నేరుగా తల్లి అకౌంట్లోకి జమ చేస్తామని సీఎం జగన్ తెలిపారు. 2018-19కి సంబంధించి రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 191 కాలేజీలకు ఆదేశాలిచ్చామని వివరించారు. సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం తిరిగి చెల్లించని కాలేజీలపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్టులో పెడతామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు.