ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కొత్తగా కనెక్ట్ టు ఆంధ్ర అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. అమరావతిలోని సచివాలయంలోని తన కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి ఈ కనెక్ట్ టు ఆంధ్రా అనే పోర్టల్ను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం తాము సాయం చేయాలనుకుంటే ఈ వెబ్ పోర్టల్ ద్వారా దాన్ని అందించవచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం ఈ వెబ్సైట్ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు. చీఫ్ సెక్రటరీ వైస్ చైర్మన్గా ఉంటారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపు నిచ్చారు. సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చుని చెప్పారు.