Citizenship Act Protests: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ క్యాంపస్లు అట్టుడుకుతున్నాయి. విద్యార్థులంతా రోడ్లపైకి చేరుకొని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఐతే విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్కి నిరసనగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలో ధర్నాకు దిగారు. విద్యార్థులకు సంఘీభావంగా ఇండియా గేట్ వద్ద బైఠాయించారు. ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్, ఏకే అంటోని, పీఎల్ పునియా, అహ్మద్ పటేల్ ఆందోళనలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం చేతకాని ప్రభుత్వం.. లాఠీలు ఝుళిపిస్తూ, బుల్లెట్లు కురిపిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.