సీనియర్ హీరో రాజశేఖర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజులుగా పని లేక ఆకలితో అల్లాడుతున్న పేద కళాకారులను ఆదుకోడానికి ఈయన ముందుకు వచ్చారు. అంతేకాదు లాక్డౌన్ నేపథ్యంలో ఆకలితో అల్లాడుతున్న అన్నార్తులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. ప్రతి రోజు 300 నుంచి 500 మందికి రాజశేఖర్ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నం పొట్లాలను హైదరాబాద్లో పంపిణీ చేస్తున్నారు. మొత్తానికి ఆహారం కోసం అలమటిస్తున్నవారికి రాజశేఖర్ చేస్తోన్న సాయానికి అందరు మెచ్చుకుంటున్నారు. కరోనా వైరస్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. మన చలన చిత్ర పరిశ్రమ పెద్దలు తీసుకున్న నిర్ణయం మూలంగా షూటింగ్లు రద్దు కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కళాకారులతో పాటు పేద ప్రజలకు తన వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ పెద్దలతో కలిసి పేద కళాకారులకు, పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హీరో డా. రాజశేఖర్ తన బాధ్యతగా అందిస్తున్నారు. రాజశేఖర్ బాటలో మరికొంత మంది సినీ పెద్దలు కూడా పేద కళాకారులకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు.