మన దేశంలో టీ, కాఫీ ప్రియులు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయాన్నే నిద్ర లేవగానే వేడివేడిగా కాఫీనో, టీనో తాగకపోతే రోజు గడవని వాళ్లు చాలామందే ఉన్నారు. ఉదయం, సాయంత్రం వేడివేడి టీ లేదా కాఫీ తాగుతూ ఆ అనుభూతిని ఆస్వాదిస్తుంటారు. రోజూ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్లు ఒక్కరోజు తాగకపోతే ఆ రోజంతా ఏదో కోల్పోయినట్టుగా ఫీలవుతుంటారు.
అయితే.. ఇండియాలో ఛాయ్ ప్రియులు ఉన్నారని తెలుసు గానీ కేవలం టీ తాగి మాత్రమే బతుకుతున్న వ్యక్తి ఉన్నారని మీకు తెలుసా. అవునండీ. బీహార్కు చెందిన ఓ మహిళ కేవలం టీ తాగి మాత్రమే బతుకుతోంది. ఆమె ఆహారమే తినదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 31 సంవత్సరాలుగా ఆమె ఇలానే జీవనం సాగిస్తోంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. నమ్మశక్యంగా అనిపించకపోయినప్పటికీ ఇది పచ్చి నిజం. ఆమె ఎవరో.. ఆమె కేవలం టీ తాగి మాత్రమే ఎందుకు ఉంటున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలో ముందుకెళ్లాల్సిందే.
బీహార్లోని హాజీపూర్కు చెందిన కిరణ్ దేవి అనే మహిళ దాదాపు 31 సంవత్సరాలుగా కేవలం టీ తాగి మాత్రమే బతుకుతోంది. ఆమెకున్న ఈ అలవాటు కారణంగా ఆమెను అందరూ ఛాయ్వాలీ అని పిలుస్తుంటారు. అయితే.. కిరణ్ దేవి ఇలా కేవలం టీ మాత్రమే తాగి ఆహారం తీసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ఆమె భర్తకు టీ అంటే చాలా ఇష్టమట. పెళ్లయినప్పటి నుంచి ఇద్దరూ కలిసి భార్య చేతి టీ తాగితే గానీ కిరణ్ దేవి భర్త ఏ పనికీ వెళ్లేవాడు కాదట. అలా భార్యాభర్తలిద్దరూ కలిసి రోజూ ఉదయం, సాయంత్రం టీ తాగేవాళ్లట.
కిరణ్ దేవికి అప్పట్లో కేవలం టీ తాగి మాత్రమే బతికే వింత అలవాటు లేదు. మనలానే ఆమె కూడా ఆహారం తీసుకునేది. నీళ్లు తాగేది. కానీ.. ఆమె జీవితంలో ఓ విషాద ఘటన ఆమెను ఇలా మార్చేసింది. సాఫీగా సాగిపోతున్న కిరణ్ దేవి జీవితంలో ఆమె భర్త మరణం ఆమెను కుంగదీసింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి ఆమెకు చాలా సమయమే పట్టింది. భర్త గురించే తలుచుకుంటూ ఆమె బాధపడని రోజంటూ లేదు. భార్యాభర్తల మధ్య అంత అన్యోన్యం ఉండేది. అంతగా ప్రేమించే భర్త దూరం కావడం ఆమెను శోకసంద్రంలోకి నెట్టేసింది.
కొన్నాళ్లకు ఆ షాక్ నుంచి కోలుకుని మాములు మనిషి అయిన కిరణ్ దేవి ఓ నిర్ణయం మాత్రం తీసుకుంది. భర్త దూరమైన బాధలో ఆహారం తినడం మానేసిన ఆమె అప్పటి నుంచి కేవలం టీ తాగి మాత్రమే బతుకుతోంది. పైగా ఆమె భర్తకు టీ అంటే ఇష్టం కావడంతో అతని జ్ఞాపకంగా అప్పటి నుంచి ఆమె ఎక్కడ ఉన్నా, ఎంత పనిలో ఉన్నా రోజూ టీ మాత్రమే తాగేది. బతికినన్నాళ్లూ అలానే బతకాలని ఆమె ఫిక్సయిపోయింది. అలా అప్పటి నుంచి.. అంటే దాదాపు 31 సంవత్సరాలుగా కిరణ్ దేవి టీ మాత్రమే తాగి జీవిస్తోంది. ఉదయం, సాయంత్రం ఆమె కచ్చితంగా టీ తాగాకే ఎక్కడికైనా, ఏ పనికైనా వెళ్లేది.