మెట్రో నగరాల్లో ప్రజా జీవితంలో భాగమైపోయిన మెట్రో రైళ్లు... కరోనా లాక్డౌన్ తర్వాత ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు కేంద్రం శ్రామిక్ రైళ్లకు, దేశీయ విమాన సర్వీసులకు, ప్రైవేట్ చాపర్లకు అనుమతులు ఇవ్వడంతో... ఇక నెక్ట్స్ తమకు కూడా అనుమతులు వస్తాయని దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సంస్థలు భావిస్తున్నాయి. ముందుగా ఢిల్లీ మెట్రో... కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అక్కడ రెండు నెలలుగా ఆగిపోయిన రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లూ చేశారు. నేటి నుంచే ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. మొత్తం 14000 మంది ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు వచ్చినా... రైళ్లు ఇవాళ కదిలే పరిస్థితి లేదు. బస్సులు, క్యాబ్ సర్వీసులు, ఆటోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో... మే 31 తర్వాత తమకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఢిల్లీ మెట్రో నిర్వాహకులు భావిస్తున్నారు.
మిగతా రాష్ట్రాల్లోనూ మెట్రో రైళ్లు రెడీ అవుతున్నాయి. ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగులు, డాక్టర్లు, వర్కర్లను మాత్రమే అనుమతిస్తారని తెలుస్తోంది. అలాగే... మొదట్లో కొన్ని గంటల వరకూ మాత్రమే సర్వీసులకు అనుమతిస్తారనే అభిప్రాయమూ ఉంది. అలాగే... ఒక్కో కోచ్లో 50 మందిని మాత్రమే అనుమతిస్తారనీ... రద్దీ సమయాల్లో 350 మంది వరకూ మాత్రమే ప్రయాణించేలా చేస్తారని సమాచారం.
కేంద్రం అనుమతి ఇవ్వగానే... 24 గంటల తర్వాత సర్వీసులు ప్రారంభించేలా మెట్రోలు రెడీ అవుతున్నాయి. ఆ సమయంలో... స్టేషన్ల ప్రాంగణాలు, మెట్లు, ఎస్కలేటర్లు అన్నీ ఫుల్లుగా శానిటైజ్ చేస్తారు. అలాగే... సోషల్ డిస్టాన్స్ పాటించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల దగ్గర కస్టమర్ కేర్ హబ్లను రెడీ చేస్తున్నారు. ప్రయాణికులు మాస్క్ ధరించాలి. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ప్రయాణికుల మధ్య సీటును ఖాళీగా ఉంచుతారు. ప్రయాణికులు నిల్చునేటప్పుడు కనీసం మీటర్ దూరం నిల్చునేలా చేస్తారు.
హైదరాబాద్ లాంటి చోట ప్రజలు మెట్రో సర్వీసుల కోసం ఎదురుచూస్తున్నారు. క్యాబ్ సర్వీసుల్లో ప్రయాణానికి ఎక్కువ ఖర్చు అవుతోందనీ... అదే బస్సులు, మెట్రో రైళ్లూ నడిస్తే... సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఢిల్లీ మెట్రోతోపాటూ... మిగతా మెట్రోలన్నీ జూన్ మొదటి వారంలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.