ఇక్కడ సహజసిద్ధ వాతావరణంలో జీవించడం వల్ల తండా వాసులు రోగ నిరోధిక శక్తి ఎక్కువగా కలిగి ఉంటున్నారు. గ్రామంలోని ప్రజల్లో తెల్ల రక్త కణాల సంఖ్య పెరిగి ఇన్ఫెక్షన్లు, జబ్బులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. తాజా గాలిని పీల్చుకోవడం వల్ల మెదడు కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది... ఇదే రాజమ్మ తండా వాసులకు వరంగా మారింది.
పచ్చని ప్రకృతి మధ్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం. వీరి సగటు జీవనం 90 ఏళ్లకు పైనే ఉంది. అయితే ఈ తండాలో గత మూప్పై ఏళ్లలో ఏడుగురు మాత్రమే మృతిచెందడం విశేషంగా చూడాలి. చనిపోయిన ఏడుగురిలో కూడా నడి వయస్సు కలిగిన వాళ్లు ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వంద ఏళ్లు పూర్తిచేసుకున్నారు.
మరో ముగ్గురు 90 ఏళ్ల వయసులో మరణించారు. ఈగ్రామంలో ఇప్పటికీ 90 ఏళ్లపైబడి వాళ్లంతా వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అయితే వీళ్ల ఆరోగ్య రహస్యం ఏమిటంటే వంటలకు గ్యాస్ స్టౌవ్ కాకుండా కట్టెల పొయ్యిపై వండుకుంటారు. ప్రధాన ఆహారంతో పాటు మక్క రొట్టెలు, అల్లం-ఎల్లిగడ్డ కారంతో తింటారు. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్కపూట కూడా గడవదని తండా వాసులంటారు.
మినరల్ వాటర్ కామన్గా మారిన ప్రస్తుత సమాజంలో ఈ తండావాసులు మాత్రం బోరు నీళ్లనే తాగుతారు. తండాకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ మినరల్ వాటర్ తాగడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ప్రపంచాన్నే వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తండా దరి చేరలేదు. వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన తండా వాసులు కరోనా టైమ్లో తండాకు వచ్చి సేఫ్ జోన్ లోకి వెళ్లారు.