తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బుధవారం నుండి రాబోయే ఐదు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనితో ఫిబ్రవరిలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉండనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 నుంచి 10°C కంటే తక్కువగా నమోదవుతాయి. ఇతర జిల్లాలలో 9 నుంచి 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. హైదరాబాద్లో కూడా 9 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దీనికి తోడు బలమైన చలి గాలులు వీస్తాయి. ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీల మధ్య, బలమైన ఈశాన్య శీతల గాలుల కారణంగా ఉష్ణోగ్రత తగ్గుతుంది.
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రాబోయే పది రోజుల పాటు పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతుంది. కనిష్ణ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట, ఉదయం 8 గంటలలోపు బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అనారోగ్యంతో ఉన్న వారు, గుండెజబ్బులు ఉన్న వారు చలిలో బయటకు వెళ్లవద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి పొగమంచు ప్రధాన సమస్యగా ఉంది. తెల్లవారుజామున, ఉదయం రహదారులపై మంచు ప్రభావంతో వీక్షణ తగ్గే అవకాశం ఉంది. అందుకే వాహనాలు నడిపే వారు చాలా నిదానంగా ప్రయాణం చేయడం మంచిది. అతివేగం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంది.