సాక్షాత్తు ఆయా జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగి వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సర్వే తీరును పరిశీలించారు. ఆయా కాలనీల్లోని ప్రజలతో మాట్లాడుతూ వారి ఆరోగ్యం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై ఆరా తీశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సర్వే కోసం సుమారు 1004 బృందాలను ఏర్పాటు చేయగా, మంచిర్యాల జిల్లాలో సుమారు 485 బృందాలను ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో భాగంగా తొలిరోజు సిబ్బంది 29 వేల 977 ఇండ్లను సందర్శించారు. ఈ సందర్భంగా 706 మంది వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులను గుర్తించి వారికి అవసరమైన మందుల కిట్లను అందజేశారు.
అటు నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖి ఆ జిల్లాలోని లోకేశ్వరం, ముథోల్ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి జ్వర సర్వే తీరును పరిశీలించారు. ఇందులో భాగంగానే లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామంలో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి ఆరోగ్య సిబ్బంది సర్వేలో పాల్గొన్నారా? లేదా అని విచారించారు.
జ్వరంతో ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్లు అందజేశారు. రెండు డోసులు టీక తీసుకున్నవారు 6 నెలలు కాగానే బూస్టర్ డోసు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో ఇండ్లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఇండ్లు సర్వే పూర్తి ఐనది? ఊర్లో ఎవరైనా జ్వరాలు లేదా ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.