రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) సొంతగడ్డపై దుమ్మురేపుతోంది. లేటెస్ట్ గా శ్రీలంక 2-0 తేడాతో టెస్టుల్లో మట్టికరిపించింది రోహిత్ సేన. ఇక సొంతగడ్డపై భారత్కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం. అయితే, కీలకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC 2021-23 Final) కు ఈ సారి టీమిండియా చేరడమే క్లిష్టంగా మారింది. కష్టపడితే మాత్రం ఛాన్సులుంటాయ్.
ఇక, డబ్ల్యూటీసీ 2021-23 ఎడిషన్లో టీమిండియా ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నూతన సారథి రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండి ఫైనల్ చేరాలంటే ఈ సీజన్లో మిగిలి ఉన్న ఏడు మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన కనబరచడంతో పాటు మిగతా జట్ల జయాపజయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి భారత జట్టు అవకాశాలను సంక్లిష్టం చేసింది.
ఇప్పటి వరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లతో జరిగిన సిరీస్ల్లో 6 విజయాలు, 2 డ్రా చేసుకున్న టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక 2021-23 షెడ్యూల్లో భాగంగా ఇంకా ఇంగ్లండ్లో ఒక టెస్టు, బంగ్లాదేశ్లో రెండు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు టీమిండియా ఆడాల్సి ఉంది.
ఆస్ట్రేలియా బలమైన జట్టు. పాకిస్తాన్తో టెస్టు సిరీస్ ఆడటం వాళ్లకు కలిసొస్తుంది. ఉపఖండ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోవడానికి టీమిండియాతో సిరీస్కు ముందు పాక్ పర్యటన వారికి మేలు చేస్తుంది. ఆస్ట్రేలియా టీమ్ కు నాథన్ లియాన్, స్వెప్సన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అయితే, ఇంగ్లండ్తో మ్యాచ్ మినహా మిగతావన్నీ ఉపఖండంలోనే ఆడటం భారత్కు కలిసి వచ్చే అంశం.
ఇక, ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో 4-0 తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండింటిని డ్రా చేసుకుంది. ఇక ఇంగ్లండ్ అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ స్వదేశంలో జరిగే మ్యాచ్లో టీమిండియాకు సవాల్ విసిరే అవకాశం ఉంది. మూడో స్థానంలో సౌతాఫ్రికా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఆ జట్టు ఆట కూడా ఎంతో మెరుగైంది. రెండో స్థానంలో దాయాది పాక్ ఉంది.