టీ20 వరల్డ్కప్ (T-20 World Cup 2021) తో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) పదవీ కాలం ముగియనుంది. ఈ మెగాటోర్నీ తర్వాత అతను తప్పుకోనుండటంతో కొత్త కోచ్ కోసం బీసీసీఐ(BCCI) నానా తంటాలు పడింది. ఈ పదవిపై ఎంతో మంది విదేశీయులు ఆసక్తిగా ఉన్నా.. బీసీసీఐ మాత్రం ఓ ఇండియన్కే అప్పగించాలని భావించింది. ఆ దిశగా అడుగులేసింది. చివరికి అనుకున్నది సాధించింది బీసీసీఐ.
అవును.. టీమిండియా తర్వాతి కోచ్ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి తెరపడింది. అందరూ ఊహించినట్టుగానే టీ20 వరల్డ్కప్ 2021 తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బాధ్యతలు చేపట్టబోతున్నారు. గంగూలీ (Sourav Ganguly) మొండి పట్టుతో.. రాహుల్ ద్రావిడ్ ఎట్టకేలకు కోచ్ బాధ్యతలు చేపట్టాడానికి అంగీకరించాడు.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్టుగా కోహ్లీ స్వయంగా ప్రకటించాడు. అయితే వన్డే ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి కూడా కొహ్లీని తప్పిస్తారనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ద్రావిడ్ ను కోచ్ గా ఎంపిక చేయడంలో కూడా బీసీసీఐ పెద్దల నిర్ణయమే ఫైనల్ అవుతోందని స్పష్టం అవుతోంది.