క్రికెట్ (Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఐపీఎల్ 2022 మెగావేలాని (IPL 2022 Mega Auction)కి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదిల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. ఇప్పటికే ప్లేయర్స్ రిటెన్షన్స్ (Player Retentions) ప్రక్రియ పూర్తైంది. సీనియర్ ప్లేయర్లకే దాదాపు ఫ్రాంచైజీలన్నీ పెద్దపీఠ వేశాయి. అదే సమయంలో కొంత మంది యువ ప్లేయర్లు, అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా లక్కీ చాన్స్ కొట్టేశారు. ఐపీఎల్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను వారి ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, రషీధ్ ఖాన్ , శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్లతో పాటు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
క్యాపిటల్స్ను విజయవంతంగా నడిపించిన శ్రేయాస్ అయ్యర్.. 2020 ఐపీఎల్లో జట్టును ఫైనల్ చేర్చాడు. అయితే ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. ఇక అయ్యర్ గాయంతో ఐపీఎల్ 2021 సీజన్ తొలి అంచె పోటీలకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఢిల్లీ మేనేజ్మెంట్ రిషబ్ పంత్కు నాయకత్వం బాధ్యతలు అప్పగించింది.
తాజాగా మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శ్రేయాస్ అయ్యర్ను రిటైన్ చేసుకోలేదు. ఆటగాడిగా తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని.. అందుకే రిటైన్ చేసుకోలేదని ఢిల్లీ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2375 పరుగులు చేసిన అయ్యర్పై మూడు ఫ్రాంచైజీలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్, సూపర్ కింగ్స్ లు శ్రేయస్ అయ్యర్ ని దక్కించుకోవడానికి కాచుకుని కూర్చున్నాయని తెలుస్తోంది. గతంలో అతడు లక్నో, అహ్మదాబాద్ లకు సారథ్యం వహిస్తాడని వార్తలు వచ్చినా అందులో నిజమ లేదని తేలిపోయింది. లక్నోకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్ కు హార్దిక్ పాండ్యాలు కెప్టెన్లుగా సెలక్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఆర్సీబీ : ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ కూడా శ్రేయాస్ అయ్యర్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. కోహ్లి, మ్యాక్స్వెల్, సిరాజ్లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ శ్రేయాస్ అయ్యర్ కోసం భారీగానే వెచ్చించనున్నట్లు సమాచారం. అయ్యర్ కోసం పోటీ పడడంపై పరోక్షంగా కోహ్లి సలహా కూడా ఒక కారణమని తెలిసింది. పైగా మ్యాక్స్వెల్ను కెప్టెన్ చేయకుంటే.. అయ్యర్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పంజాబ్ కింగ్స్ : ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్ను పంజాబ్ వదులుకోవడంతో ఆ జట్టుకు ఇప్పుడు కొత్త కెప్టెన్ అవసరం చాలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ను విజయవంతంగా నడిపించిన రికార్డు ఉండడంతో అతన్ని దక్కించుకోవడం కోసం పంజాబ్ కచ్చితంగా ప్రయత్నిస్తోంది. ఇక అయ్యర్ పంజాబ్కు ఎంపికైతే మాత్రం కచ్చితంగా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మాయంక్ అగర్వాల్ను భారీ ధరకు రిటైన్ చేసుకున్న పంజాబ్.. అతనికి అండగా అయ్యర్ను జట్టులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉంది.