వెన్నునొప్పి కారణంగా ఇప్పటికే ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) మొత్తానికి దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన బౌలర్ దీపక్ చాహర్ (Deepak Chahar). దీంతో, డిఫెడింగ్ చాంపియన్స్ చెన్నైకి భారీ షాక్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం గాయం తీవ్రమవటం వల్ల మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడని తెలుస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు సైతం చాహర్ దూరమవుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
గాయాలతో బాధపడుతున్న దీపక్ ఈ సీజన్లోని ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఏప్రిల్ రెండో వారంలో లీగ్లోకి ప్రవేశిస్తాడనుకున్న చాహర్.. వెన్ను నొప్పి గాయంతో ఇప్పుడు సీజన్ మొత్తానికి దూరమవుతున్నాడని సీఎస్కే జట్టు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో చాహర్ గురించి క్రికెట్ అభిమానుల్లో ఓ చర్చ మొదలైంది. అతడు ఈ లీగ్కు సంబంధించిన రూ.14 కోట్ల మొత్తాన్ని పొందుతాడా? లేదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు
బీసీసీఐ కాంట్రాక్ట్లో ఉన్న ఆటగాళ్లందరికీ బీమా పాలసీ ఉంటుంది. గాయాల కారణంగా ప్లేయర్లు ఐపీఎల్ సీజన్కు దూరమైతే.. బీసీసీఐ బీమా పాలసీ ద్వారా ఆటగాళ్లకు డబ్బులను చెల్లిస్తుంది. ఈ నిబంధన ఐపీఎల్ సీజన్ 2011 నుంచి అమల్లోకి వచ్చింది.ఒకవేళ కాంట్రాక్ట్ లేని ఆటగాడు గాయపడి, సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోతే, ఆ ఆటగాడికి ఎటువంటి డబ్బును చెల్లించరు.