క్రీడలను కెరీర్గా ఎంచుకునే మహిళలకు ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయి. ముందు ఆడపిల్లను ఆటల వైపు పంపడానికే భయపడే సమాజంలో.. ఇక తల్లి అయిన తర్వాత కూడా ఆడతానంటే ఎవరు ఒప్పుకుంటారు. కానీ తల్లిగా మారినా ఇంకా అంతర్జాతీయ వేదికలపై పతకాల వేటలో ఉన్నారు కొందరు అమ్మలు. అంతర్జాతీయ మదర్స్ డే సందర్భంగా ఆ సూపర్ స్పోర్ట్స్ మామ్స్ను మనమూ గుర్తు తెచ్చుకుందాం.
అనిత పాల్దురై - భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టన్ అయిన అనిత పాల్దురై ఎన్నో రికార్డులు సృష్టించింది. ఏసియన్ బాస్కెట్ బాల్ కాన్ఫెడరేషన్ చాంపియన్షిప్స్లో వరుసగా 9 సార్లు పాల్గొన్న ఏకైక, మొదటి మహిళ అనిత. తమిళనాడుకు చెందిన అనిత అతి స్వల్పకాలంలోనే భారత బాస్కెట్బాల్ ముఖచిత్రంగా మారిపోయింది. 19 ఏళ్ల వయసులోనే టీమ్ ఇండియాకు సారథ్యం వహించింది. 2013లో ఒక బిడ్డకు తల్లైన తర్వాత కూడా నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి ఫిట్నెస్ సాధించి తిరిగి బాస్కెట్ బాల్ కోర్టులోకి అడుగు పెట్టింది.
సానియా మీర్జా - భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలియని వారుండరు. మహిళా టెన్నిస్ ప్లేయర్గా ఎన్నో రికార్డులు ఆమె సొంతం. గ్రాండ్ స్లామ్ సాధించిన ఏకైక భారత మహిళా టెన్నిస్ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అయితే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న అనంతరం ఒక బాబుకు తల్లైంది. కానీ, ఆ తర్వాత టెన్నిస్ ఆడాలనే లక్ష్యంతో వ్యాయామాలు చేసి, బరువు తగ్గి మళ్లీ ప్రాక్టీన్ మొదలు పెట్టింది. కరోనా కారణంగా టోర్నీలు ఆగిపోవడంతో సానియా ఇంటికే పరిమితం అయ్యింది.
కోనేరు హంపి - భారత చెస్ చరిత్రలో రెండో మహిళా గ్రాండ్ మాస్టర్గా రికార్డులకు ఎక్కిన కోనేరు హంపి 2006 ఏషియన్ గేమ్స్లో రెండు స్వర్ణపతకాలు సాధించింది. పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లైన తర్వాత రెండేళ్ల పాటు చెస్కు దూరంగా ఉన్న హంపీ.. తిరిగి 2019లో సర్క్యూట్లోకి అడుగుపెట్టింది. 2019లో వరల్డ్ చాంపియన్షిప్ గెలుచుకొని 2600 ఎల్లో రేటింగ్ మార్కును దాటింది. ప్రస్తుతం చెస్ పోటీలు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యింది.
సరితా దేవి - లైట్ వెయిట్ కేటగిరీలో ప్రొఫెషనల్ బాక్సర్ అయిన సరితా దేవి.. పలు పోటీల్లో పతకాలు సాధించింది. 2005 వరల్డ్ చాంపియన్షిప్స్లో కాంస్యం సాధించిన సరితా దేవి ఆ మరుసటి ఏడాదే స్వర్ణ పతకం సాధించి అందరినీ ఆశ్చర్యపరిమింది. పెళ్లై కొడుకు పుట్టిన తర్వాత ఏషియన్స్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో వెండి పతకాలు సాధించింది.
సహాన కుమారి - భారత హై జంప్ కేటగిరీలో జాతీయ రికార్డు సృష్టించిన సహాన కుమారి 2012 ఒలింపిక్స్లో పాల్గొన్నది. 1.92 మీటర్ల ఎత్తు ఎగిరిన సహాన రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు. ఆమె ఒలంపిక్స్లో పాల్గొనే సమయానికే ఒక అమ్మాయికి తల్లి. కానీ భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో తల్లి అయిన తర్వాత కూడా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నది. ఇప్పుడు ఆమె కూతురు కూడా హై జంప్లో రాణిస్తున్నది.
మేరీ కోమ్- భారత స్టార్ రెజ్లర్ మేరీ కోమ్ టోక్యో ఒలంపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నది. 2012 ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించిన మేరీ కోమ్.. ఇప్పటి వరకు ఏసియన్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన ఏకైన మహిళా బాక్సర్గా రికార్డులకు ఎక్కింది. పెళ్లి చేసుకొని నలుగురు పిల్లలను కన్న తర్వాత కూడా బాక్సర్గా రాణిస్తూనే ఉన్నది.
కృష్ణ పూనియా - డిస్కస్ త్రోలో అనేక రికార్డులు నెలకొల్పిన కృష్ణ పూనియ మూడు సార్లు ఒలంపిక్స్లో పాల్గొన్నది. 2010లో కామన్వెల్స్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించింది. 2006, 2010 ఏసియన్స్ గేమ్స్లో కాంస్య పతకాలు సాధించింది. తన కోచ్ వీరేందర్ పూనియాను 2001వలో పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూనే ఉన్నది.