ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో రోహిత్ శర్మ (Rohit Sharam) దుమ్మురేపాడు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ శైలిలో హిట్ మ్యాన్ సిక్స్తో శతకాన్ని అందుకున్నాడు. మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదిన రోహిత్.. కెరీర్లో తొలి ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ అందుకున్నాడు. ఓవరాల్గా అతనికిది ఎనిమిదో టెస్ట్ సెంచరీ.
పూజారాతో కలిసి 100కు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రోహిత్ శర్మ, టీమిండియాని మంచి పొజిషన్లో నిలిపాడు. ఓవర్నైట్ స్కోరు 43/0 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... 83 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 101 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్తో 46 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
2021 క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్గానూ నిలిచాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది జో రూట్, బాబర్ ఆజమ్, రిజ్వాన్ వెయ్యికి పైగా పరుగులు సాధించిన వారిలో ఉన్నారు. ఓపెనర్గా 11 వేల పరుగులు అందుకున్న రోహిత్ శర్మ, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
సచిన్ టెండూల్కర్ 241 ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా 11 వేల అంతర్జాతీయ పరుగులు అందుకుంటే, రోహిత్ శర్మ 246 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. అయితే సచిన్ కంటే రోహిత్ శర్మ యావరేజ్ ఎక్కువ ఉండడం విశేషం.11 వేల పరుగులను అందుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ సగటు 49.2 కాగా, రోహిత్ శర్మ 49.4 సగటుతో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఈ టెస్టు సిరీస్లో మొత్తంగా 700+ పైగా బంతులను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. తన కెరీర్లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు 2019లో భారత్లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో అత్యధికంగా 683 బంతులు ఆడాడు రోహిత్.ఇంగ్లాండ్లో ఓపెనర్గా అన్ని ఫార్మాట్లలో కలిపి 18వ సారి 50+ స్కోరు చేసిన రోహిత్ శర్మ... అత్యధిక సార్లు ఈ ఫీట్ సాధించిన ఓపెనర్గా డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు