బీసీసీఐ (BCCI) తమ హిస్టరిలోనే తొలి సారిగా ఒక ప్రయోగం చేయబోతుంది. టీమిండియా (Team India) టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగానే.. పరిమిత ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన మరో జట్టును శ్రీలంకకు (Srilanka Tour) పంపనున్నది.ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దీంతో, లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నారు. లంక టూర్కి కోచ్గా వ్యవహరించమని బీసీసీఐ ద్రావిడ్ని కోరినట్లు తెలుస్తోంది. ద్రావిడ్తో పాటు ఎన్సీఏలోని సపోర్ట్ స్టాఫ్ కూడా లంకకి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఐదు టెస్ట్ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకు సంబంధించి 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్లు అనంతరం.. ఆగస్టులో ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది.
జూలైలో జరుగనున్న ఈ ద్వైపాక్షిక సిరీస్కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, తొలుత భావించినట్లు ఐదు టీ20, 3 వన్డేలు కాకుండా.. 3 టీ20లు, 3 వన్డేలు ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ మేరకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) కి సమాచారం అందించడంతో షెడ్యూల్ కూడా ఆరు మ్యాచ్లకు విడుదల చేసింది.
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో భారత జట్టు (ఇండియా-బి టీమ్)ను బీసీసీఐ పంపనుంది. ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో ఓ జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది.
లంక పర్యటనకు కోచ్గా రాహుల్ ద్రావిడ్ వెళ్లడం ఖాయం అయినా.. కెప్టెన్ ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. కెప్టెన్ రేసులో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. యువ బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం వహించిన అయ్యర్కు జట్టు పగ్గాలు దక్కే అవకాశం ఉంది.