కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా హాట్ హాట్గా జరుగుతోంది. ఈ చట్టాలపై రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది. ఢిల్లీ శివారులో వేలాది మంది రైతులు 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఐతే ఈ ఆందోళనల వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని.. విపక్షాల ఉచ్చులో పడవొద్దని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. అంతేకాదు రైతుల ఆందోళలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లాయని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసలు కొత్త చట్టాలపై క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు? కొత్త చట్టాలను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని న్యూస్ 18 తెలుసుకునే ప్రయత్నం చేసింది.
మీరు వ్యవసాయరంగంలో సంస్కరణలు, భారత వ్యవసాయాన్ని ఆధునీకరించడాన్ని సమర్థిస్తారా? ప్రశ్నించగా... సర్వేలో పాల్గొన్న వారిలో 73.05 శాతం మంది వ్యవసాయరంగంలో సంస్కరణలను సమర్థించారు. మండీల బయట తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు అవకాశం కల్పించడాన్ని మీరు సమర్థిస్తారా? అని అడగగా... 69.65 శాతం మంది దీన్ని సమర్థించారు.
భారత వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు, రైతుకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్రం తెచ్చిన చట్టాలకు మద్దతు తెలుపుతారా? అని ప్రశ్నించగా... 53.6 శాతం మంది కొత్త వ్యవసాయ చట్టాలను సమర్థించారు. 30.6 శాతం మంది సమర్థించలేదు. 15.8 శాతం మంది చెప్పలేం అన్నారు. కొత్త చట్టాల ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని మీరు భావిస్తున్నారా? అని అడిగితే... కొత్త చట్టాల ద్వారా రైతు ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని 60.90 శాతం మంది తెలిపారు.
కనీస మద్దతు ధర వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇస్తే, దానిని మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించగా... ప్రభుత్వం ఇచ్చే రాతపూర్వక హామీని 53.94 శాతం మంది సమర్థించారు. ఢిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నిషేధిస్తూ.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని మీరు సమర్థిస్తారా? అని ప్రశ్నించగా... 66.71 శాతం మంది దీనిని వ్యతిరేకించారు.