ఈ రోజుల్లో సినిమాను తీయడం కంటే తీసిన సినిమాను కాపాడుకోవడం మరీ దారుణంగా మారిపోయింది. ఆ మధ్య కనీసం విడుదలైన ఒక్కరోజు తర్వాత పైరసీ వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క షో కూడా గ్యాప్ ఇవ్వడం లేదు. మార్నింగ్ షో థియేటర్స్లో ఇలా పడిందో లేదో అప్పుడే మేమున్నాం అంటూ పైరసీ సైట్లు పండగ చేసుకుంటున్నాయి. ఇది చూసిన తర్వాత అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా.. ఇంత తొందరేంట్రా బాబూ మీకు అంటూ తిట్టి పోస్తున్నారు.
ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ రోజే లీక్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఈ సినిమాను కూడా అప్పుడే ఆన్లైన్లో పెట్టేసారు. రాజమౌళి నాలుగేళ్ల కష్టం.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మూడేళ్ళ శ్రమ.. నిర్మాత డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ అన్నీ ఒక్కరోజులోనే లీక్ చేసారు. తమిళ్ రాకర్స్ సహా మరికొన్ని మెయిన్ సైట్స్లో సినిమా పైరసీ లింకులు కనిపిస్తుండటంతో అభిమానులు కంగారు పడుతున్నారు.
ఈ విషయంలో దర్శక నిర్మాతలు చాలా సీరియస్ అవుతున్నారు. పైరసీ చూడొద్దంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులను వాళ్లు కోరుకుంటున్నారు. ఇలాంటి లింకులు కనిపిస్తే వెంటనే యాంటీ పైరసీ సెల్కు చెప్పాలని తెలిపారు దర్శక నిర్మాతలు. పైగా కొన్నేళ్లుగా తమిళ్ రాకర్స్ నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎక్కడుంటారో తెలియదు.. ఎలా ఉంటారో తెలియదు.. ఎక్కడ్నుంచి వస్తున్నారో తెలియదు.. కానీ చెప్పిన టైమ్.. డేట్ ఏ మాత్రం తప్పకుండా చెప్పినట్లుగానే రిలీజ్ డే పైరసీ ప్రింట్లు అప్లోడ్ చేస్తున్నారు తమిళ్ రాకర్స్.
ఇప్పుడు సైబర్ పోలీసులకు కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు వీళ్లు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. పైరసీ చేస్తున్నారు కదా అని వాళ్లను ఎవరైనా తిడితే వాళ్ల ఇగో హర్ట్ అవుతుంది.. అప్పుడు చెప్పి మరీ సినిమాను పైరసీ లింక్ పెడతారు. వాళ్ల ఇగో హర్ట్ చేయకుండా ఉంటే కనీసం విడుదలైన తర్వాత ఒక్క రోజైనా ఆగుతారు లేదంటే అంతే సంగతులు.