సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు. కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె.
మరణించి 16 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఈమెను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. చనిపోయేనాటికి సౌందర్య వయసు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే.. పైగా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపేసింది. 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు.
సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేసాడు. తాను చనిపోయే ఏడాది ముందే అంటే 2003 ఫిబ్రవరి 15న సౌందర్య వీలునామా రాశారని.. అందులో ఉన్నదాని ప్రకారమే తమకు కూడా ఆస్తులు పంచాలని అమర్ నాథ్ భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్టేట్ కోర్టును ఆశ్రయించారు.
తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్షసాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంత కాలం వీరు కోర్టు చుట్టు తిరిగారు.
2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి. ఇవన్నీ కూడా బయోపిక్లో ఉంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే సౌందర్య జీవితంలో అత్యంత కీలకంగా ఉన్న 1990 నుంచి 2004 వరకు ఆ 14 ఏళ్లు కీలకంగా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.