ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన పుష్ప.. కొత్త ఏడాది కూడా అదే జోరు చూపిస్తుంది. విడుదలైన 16వ రోజు హిందీలో రికార్డు వసూళ్లు సాధించింది. ఏకంగా 6 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. మొదటి రోజు వచ్చిన వసూళ్ల కంటే కూడా ఇది చాలా ఎక్కువ.
హిందీలో మొదటి రోజు కేవలం 3.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది పుష్ప. ఆ తర్వాత వరసగా రోజుకు కనీసం 2 కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ జోరు మరింత పెరిగిపోయింది. హిందీలో కూడా కొత్త సినిమాలేవీ విడుదల కావడం లేదు. దాంతో అది క్యాష్ చేసుకుంటుంది సినిమా. టాక్ కూడా బాగానే ఉండటంతో హిందీలో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప.
విడుదలైన 16వ రోజు కూడా ఏకంగా 6.10 కోట్లు వసూలు చేయడం ఏంటో తెలియక ట్రేడ్ పండితులు కూడా షాక్ అవుతున్నారు. అంతేకాదు హిందీలో పుష్ప సినిమాకు హైయ్యస్ట్ సింగిల్ డే కలెక్షన్ కూడా ఇదే. ఇప్పటికే బాలీవుడ్లో అంచనాలకు మించి రాణిస్తుంది పుష్ప సినిమా. అక్కడ ఈ సినిమాకు 56 కోట్లు వచ్చాయి. 75 కోట్ల దిశగా వేగంగా దూసుకుపోతుంది పుష్ప. ఇదే విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ పండితుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు.
కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. ఇప్పటికీ కొన్నిచోట్ల ఈ చిత్రానికి హౌజ్ ఫుల్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవరాల్గా ఇప్పటికే పుష్ప సినిమాకు 300 కోట్ల గ్రాస్ వచ్చింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్కు అంతా ఫిదా అయిపోతున్నారు.
అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఫుల్ రన్లో సినిమా 350 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.