మోహన్ బాబు (Mohan Babu) సినిమాలకు మునపటిలా ఇప్పుడు మార్కెట్ లేదని అందరికీ తెలుసు. ఈయన సినిమాలు విడుదలైతే ఓపెనింగ్స్ తక్కువగానే వస్తాయని అంతా ఊహించారు. కానీ ఊహించని విధంగా అసలు ఓపెనింగ్స్ కూడా రావని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’కు (Son Of India 1st weekend collections) ఇదే జరుగుతుంది. ఈ సినిమాకు తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
హీరోగా వచ్చి.. విలన్గా మారి.. కమెడియన్గా చేసి.. కారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుని.. మళ్లీ హీరోగా నిలబడి స్టార్ అయ్యాడు మోహన్ బాబు. 550కి పైగా సినిమాలు చేసి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ సీనియర్ హీరో.. తాజాగా సన్ ఆఫ్ ఇండియాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఈ సినిమా చేసాడు.
పిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన సన్ ఆఫ్ ఇండియాకు ఊహించని పరాభవం ఎదురైంది. సాధారణంగా సినిమాలు ప్లాప్ అవడం కామన్. ఎంత నెగిటివ్ టాక్ వచ్చినా కూడా కొన్ని అయినా కలెక్షన్స్ వస్తుంటాయి. రెండో రోజు నుంచి పడిపోతుంటాయి. కానీ సన్ ఆఫ్ ఇండియా విషయంలో మాత్రం మొదటి రోజు మొదటి షో నుంచే తిరస్కరణ కనిపించింది.
తెలుగు ఇండస్ట్రీలో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా మరోటి లేదనే చెప్పాలి. ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి. కనీసం ఒక్క రూపాయి కూడా షేర్ తీసుకురాకపోగా.. నెగిటివ్ షేర్ తీసుకొచ్చిన ఘటన సన్ ఆఫ్ ఇండియాకే చెల్లింది. తొలి మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షల గ్రాస్ వచ్చిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అంటే షేర్ లెక్కలేస్తే రెంట్ కాదు కదా పార్కింగ్ డబ్బులు కూడా రానట్లే. అంత దారుణంగా పడిపోయింది. ప్రేక్షకులు థియేటర్స్కు రాక.. జనం లేక చాలా చోట్ల షోలు కూడా క్యాన్సిల్ చేసారు. ఇక మూడో రోజుకు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. లక్షల నుంచి గ్రాస్ కూడా వేలల్లోకి పడిపోయిందని తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో మాత్రమే 35 వేల వరకు షేర్ వచ్చిందని తెలుస్తుంది.
మిగిలిన చోట్ల కనీసం షేర్ కాదు కదా ఏం రావట్లేదనేది బయ్యర్ల వాదన కూడా. రెండో రోజు ఎక్కడా సన్ ఆఫ్ ఇండియాకు ఆడియన్స్ నుంచి ఆదరణ లభించలేదు. ఒప్పుకోడానికి కాస్త కష్టంగానే అనిపించినా మోహన్ బాబు కెరీర్లో ఇంత కంటే పెద్ద డిజాస్టర్ లేదు.. ఇక రాదేమో కూడా. నాలుగేళ్ల కింద గాయత్రి విడుదలైనపుడు కనీసం 60 లక్షల షేర్ అయినా వచ్చింది.
ఇప్పుడు అందులో 10వ వంతు అంటే కనీసం 6 లక్షల షేర్ కూడా రావడం లేదంటూ విశ్లేషకులు చెప్తున్న మాట. సోషల్ మీడియాలో దీనిపై ట్రోలింగ్ కూడా బాగానే జరుగుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు భార్యగా మీనా నటించింది. తమపై ట్రోల్స్ చేస్తున్న వాళ్లపై మంచు కుటుంబం కూడా సీరియస్ అయింది. వాళ్లపై 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కూడా.
మూడో రోజు చాలా చోట్ల సన్ ఆఫ్ ఇండియా సినిమా కనిపించలేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మాత్రం మెయిన్ థియేటర్లో మూడు రోజులకు కలిపి 62 వేల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుగు ట్రేడ్ అనలిస్ట్ జీవి తెలిపారు. మూడో రోజు కేవలం 14 వేలతోనే సరిపెట్టుకుంది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ అసలు షేర్ రాలేదు సరికదా నష్టాలే మిగిలాయి. మొత్తానికి సన్ ఆఫ్ ఇండియా నెగిటివ్ షేర్స్ విషయంలో సరికొత్త చరిత్రకు తెరతీసింది. మంచు విష్ణు ఈ సినిమాను తన 24 ఫిల్మ్ ఫ్యాక్టరీపై నిర్మించాడు. అన్నట్లు ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.