Immunity Booster Fruits:నవంబర్ మాసం వచ్చిందంటే చాలు మన దేశంలో చలికాలం ప్రారంభమవుతుంది. సాయంకాలం 5 గంటలు దాటితే చాలు ప్రజలు చలికి గజ గజ వణికిపోతుంటారు. ఉదయం అయితే బయటకు రావడానికి కూడా ప్రజలు భయపడుతుంటారు. దీని నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి స్వెటర్లు, కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజులు వంటివి ఉపయోగిస్తాం. అయితే శరీరం బయట రక్షణ వరకు ఎలాగోలా గడిచిపోతుంది.`
ఇప్పటికే కరోనా సెకెండ్ వేవ్ టెన్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఇప్పటికే భారత దేశంలో డెల్టా న్యూ వేరియంట్ కేసులు టెన్షన్ పెంచుతున్నాయి. దీనికి తోడు శీతాకాలం ఎంటర్ అవుతోంది. సాధారణంగా పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. జలుబు, దగ్గు, సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి వాటితో చాలామంది బాధపడుతుంటారు.
ఆ సమస్యలు అన్నింటిని మన శరీరం తట్టుకుని ఆరోగ్యంగా ఉండాలి అంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి అంటే.. ఆహారంలో సీజనల్ పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలం ఆహారంలో ఏయే పండ్లను ఆహారంగా తీసుకోవాలో చూద్దాం.
నారింజ: శీతాకాలం పండ్లలో నారింజ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇవి రుచిగా ఉండటంతో పాటు శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. నారింజ సిట్రస్ పండ్లు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చలికాలంలో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కావున రోగనిరోధక శక్తిని పెంచేందుకు నారింజను తినాలి.
సీతాఫలం: సీతాఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శీతాకాలపు ఆహారంలో సీతాఫలాన్ని తప్పక చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులో విటమిన్-బి6 వంటి పోషకాలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.
దానిమ్మ: శీతాకాలంలో చలిగాలి కారణంగా ప్రధానంగా కీళ్ల నొప్పుల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్తో బాధపడేవారు దానిమ్మ పండు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మపండులో ఉన్న విటమిన్ సి, విటమిన్ ఇ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతోపాటు సాధారణ వ్యాధులను సైతం నివారించి పలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.
అత్తి పండ్లు : అత్తి పండ్లల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నివారించి.. శరీరానికి రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. సాధారణంగా చలికాలంలో వేడి, బాయిల్డ్, ఆయిల్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటారు. వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. కావున పొటాషియం అధికంగా ఉండే ఆహారం చాలా అవసరం. దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి.. జీర్ణ సమస్యలు దూరమవుతాయి.