పాట్నా: బీహార్ రాజధాని నగరం పాట్నాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్, ఆయన భార్య కుష్బూ సింగ్పై కదంకౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పాట్నాలో జిమ ట్రైనర్గా పనిచేస్తున్న ఓ యువకుడి హత్యకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో భార్యాభర్తలపై కేసు నమోదైంది.
ఫిజియోథెరపిస్ట్ భార్య కుష్బూకు, జిమ్ ట్రైనర్ విక్రమ్కు మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో తేలింది. డాక్టర్కు ఈ విషయం తెలిసి విక్రమ్ను చంపుతానని బెదిరించాడని.. అప్పటి నుంచి విక్రమ్ కుష్బూకు దూరంగా ఉంటున్నాడని తెలిసింది. అయినప్పటికీ.. గత జనవరి నుంచి విక్రమ్, కుష్బూ మధ్య ఫోన్ కాల్స్ రూపంలో మళ్లీ మాటలు మొదలయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి నెల నుంచి ఇప్పటివరకూ కుష్బూ, విక్రమ్ మధ్య 1100 సార్లు ఫోన్ కాల్స్ నడిచాయి. అన్నీ అర్ధరాత్రి సమయంలో మాట్లాడుకున్న సంభాషణలే కావడం గమనార్హం. కాల్ చేసిన ప్రతిసారి ఇద్దరూ 30 నుంచి 40 నిమిషాలు మాట్లాడుకునేవారు. అయితే.. ఏప్రిల్ 18న తొలిసారిగా విక్రమ్ నంబర్కు కుష్బూ భర్త డాక్టర్ రాజీవ్ నుంచి కాల్ వెళ్లింది. చంపేస్తానని ఫోన్లో విక్రమ్ను రాజీవ్ బెదిరించాడు.
ఈ క్రమంలోనే.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విక్రమ్పై కాల్పులకు తెగబడ్డారు. కదంకౌన్ ప్రాంతంలో విక్రమ్పై కాల్పులు జరిపిన అగంతకులు 5 బుల్లెట్లను విక్రమ్ శరీరంలోకి దించారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూటీపై విక్రమ్ జిమ్ సెంటర్కు వెళుతుండగా కదమ్కౌన్ ప్రాంతంలోని బుద్ధ విగ్రహం సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. విక్రమ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
డాక్టర్ రాజీవ్, అతని భార్య కుష్బూ తనను చంపించడానికి కుట్ర పన్నారని విక్రమ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే.. పోలీసుల విచారణలో మాత్రం డాక్టర్ రాజీవ్, అతని భార్య కుష్బూ సంబంధం లేని స్టేట్మెంట్స్ ఇచ్చారు. తమకు విక్రమ్ ఎవరో తెలియదన్నట్టుగా మాట్లాడారు. కానీ.. కాల్ డేటా ఈ దంపతుల కుట్రను బట్టబయలు చేసింది. డాక్టర్ రాజీవ్ అధికార జేడీయూ నేత కూడా కావడం గమనార్హం.