Custard Apple: వింటర్ సీజన్ వచ్చిందంటే అందరి నోరు ఊరిస్తుంది సీతాఫలం.. ఈ సీతాఫలం పండ్లు నోరు ఊరించడమే కాదు.. ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సీతాఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ పండ్లను కొనుక్కుంటున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.
సీతాఫలాలకు డిమాండ్ పెరగడానికి వీటిలో తీపి రుచితోపాటు... ఎన్నో పోషకాలు కలిగి ఉండటమే. సీతాఫలంలో మన బాడీలోని విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడేస్తాయి. అందువల్లే సీతాఫలాలకు అంతలా డిమాండ్ పెరిగిపోయింది.
బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. ఈ పండ్లలోని విటమిన్ A... మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే... జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్... మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది.
సీతాఫలాల ప్రయోజనాలు పక్కన పెడితే.. ఇది కొందరి రైతులకు భారీగా ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. అందుకే సంప్రదాయ వ్యవసాయం కంటే చాలామంది రైతులు హార్టికల్చర్ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ రైతు 6 ఎకరాల బంజరు భూమిలో సీతాఫల్ను సాగు చేశాడు. దీంతో 40 లక్షల వరకు సంపాదించాడు.
లాభాలు అధికంగా రావడంతో చాలామంది రైతులు సీతాఫల్ పంట పండిస్తున్నారు. జన్వాల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ తనకున్న ఆరు ఎకరాల్లో సీతాఫలం సాగు చేశాడు. 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. అతను ఎకరానికి 2.5 లక్షలు సంపాదించాడు. 2 లక్షల ఖర్చుతో ప్రారంభించిన ఈ పంట నేడు 15 లక్షలకు పైగానే ఆర్జిస్తున్నాడు. ఇప్పటి వరకు 40 లక్షల లాభం పొందారు.
ఈ సీతాఫలాలను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని రాష్ట్రాల మార్కెట్లలో విక్రయిస్తున్నాడు. సీతాఫల్ రకాల్లో ఎంకె 1 గోల్డెన్ ప్రత్యేకమైన పండు. ఈ పండు అందంగా కనిపించడమే కాదు తక్కువ నీటిలో రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. ఈ జాతుల పండ్లు చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. ఒక్కోటి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది.
ఈ రోజుల్లో రైతులు సీతాఫలాన్ని సాగు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరాఠ్వాడాలోని ధరూర్, బాలాఘాట్ గ్రామాలు సీతాఫల్కు ప్రసిద్ధి. 1990-91 నుంచి ఉద్యానవన అభివృద్ధి పథకం కింద సీతాఫల్ను చేర్చారు. ప్రస్తుతం 25906 హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్లోని బాలానగర్ లేదా మముత్ జాతులు ఉత్పత్తి, నాణ్యత పరంగా మంచివిగా గుర్తించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పుడు ఈ చెట్లను నాటాలి.
ప్రతి మొక్కకు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కుళ్ళిన ఎరువు లేదా కంపోస్ట్ ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అలాగే మొదటి 3 సంవత్సరాలు ప్రతి మొక్కకు ఫలదీకరణం చేయాలి. 5 సంవత్సరాల తరువాత 5 నుంచి 7 చెంచాల ఆవు పేడ లేదా కంపోస్ట్ ఎరువు, 200 నుంచి 500 గ్రాముల యూరియాను అందించాలి. సీతాఫలం సహజంగా ఆకురాల్చే పండ్ల చెట్టు కాబట్టి నీరుగారిపోకుండా పెరుగుతుంది. సీతాఫలం పంటకు క్రమం తప్పకుండా నీరు అవసరం లేదు. స్వచ్ఛమైన వర్షపు నీటిపై కూడా మంచి దిగుబడిని సాధించవచ్చు. కానీ మొదటి 3 నుంచి 4 సంవత్సరాల వరకు చెట్టుకు నీరు పోస్తే మొక్క బలంగా ఎదుగుతుంది.