P Anand Mohan, Visakhapatnam, News18, Bamboo Farming Idea: మీకు చిన్న స్థలం ఉందా అయితే శుభావార్త.. కేవలం వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో సంపాదించవచ్చు.. ఇది ఎలా సాధ్యం అని అనుమాన పడుతున్నారు. అయితే వెదురు సాగు గురించి తెలుసుకోవాల్సిందే.. అయితే వెదురు చాలా అందంగా, నిటారుగా పెరిగే సుందరమైన చెట్టు.. ఇప్పుడీ చెట్లని పెంపకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చేసింది. ఇది నిజంగా శుభవార్త.
సాధరణంగా గిరిజన ప్రాంతాల్లోనే కనిపించే ఈ వెదురు చెట్ల పెంపకాన్ని ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో చేపట్టొచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిలో భాగంగా బేంబూ (వెదురు) మిషన్ ప్రాజెక్టు ను అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కింద అటవీ ప్రాంతాలకు వెలుపల బంజరు భూములు, పంట పొలాలు, గ్రామాల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాలు, కాలువలు, చెరువు గట్ల వెంబడి వెదురు మొక్కలను పెంచుతారు.
వెదురు వనాల పెంపకం, ఉత్పత్తుల అమ్మకాలు ఇటీవల వరకు అటవీ శాఖ పరిధిలో వుండేవి. దీంతో అటవీయేతర ప్రాంతాల్లో ఎవరైనా వెదురు సాగు చేపట్టి, ఉత్పత్తులను అమ్ముకోవాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పని సరి అయ్యేవి.. అయితే ఇప్పుడు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో నానాటికీ ఆదరణ పెరుగుతోంది. అడవులకు వెలుపల వున్న ప్రాంతాల్లో వెదురు పెంపకం చేపట్టాలన్న ఆసక్తి వున్న రైతులకు అటవీ శాఖ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
అందుకే ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడంతో అటవీ, పర్యావరణ శాఖ పరిధిలో ఉన్న రాష్ట్ర వెదురు మిషన్ను వ్యవసాయ, సహకార శాఖ (ఉద్యానశాఖ) లోకి మారుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రికార్డు చేయబడిన అటవీ ప్రాంతాల వెలుపల వ్యవసాయ భూముల్లో వెదురు సాగును ప్రోత్సహించడంతోపాటు వెదురుకు అదనపు విలువ జోడించేందుకు ఈ మార్పు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వెదురు ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఉద్యాన శాఖ అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, ప్రాజెక్టు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నుంచి అనకాపల్లి జిల్లా అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు అందాయి.
ఇక జిరాయితీ భూముల్లో సంబంధిత రైతులు వెదురు సాగు చేసుకుంటారు. వీరికి 50 శాతం రాయితీపై ఉద్యాన శాఖ నర్సరీల నుంచి మొక్కలను అందజేస్తారు. గ్రామాల్లో ఖాళీగా వున్న ప్రభుత్వ, పంచాయతీ స్థలాలు, కాలువలు, చెరువు గంట్ల వెంబడి వెదురు మొక్కలను నాటి పెంచుతారు. ఈ బాధ్యతను స్థానిక డ్వాక్రా సంఘాలకు లేదా ఉపాధి కూలీలకు అప్పగిస్తారని అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.
మొక్కలు నాటిన ఐదు సంవత్సరాల తరువాత వెదురును నరుకుతారు. ‘బేంబూ మిషన్ ప్రాజెక్టు’లో భాగంగా గ్రామీణ యువతతో వెదురు ఆధారిత ఉత్పత్తుల తయారీకి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయిస్తామని, ఈ ఉత్పత్తుల అమ్మకం ద్వారా స్వయం ఉపాధి లభిస్తుందని జిల్లా ఉద్యాన శాఖ చెబతోంది. కేవలం వేలల్లో పెట్టుబడి పెడితే.. లక్షల్లో ఆదాయం వస్తుందనే భరోసా కల్పిస్తోంది.