GT Hemanth Kumar, Tirupathi, News18. Hanuma Birth Place:ఇల వైకుంఠం చుట్టూ ఆంజనేయుని (Lord Hunuma) ఆలయాలు. శ్రీవారి ఆలయంకు అభిముఖంగా శ్రీ బేడీ ఆంజనేయ స్వామి., కోనేటి రాయుని కోనేరుపై కోనేటి గట్టు ఆంజనేయుడు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2కు సమీపంలో పగడాల ఆంజనేయ స్వామి, వైకుంఠం-1 వద్ద వీరాంజనేయ స్వామి, జపాలి హనుమాన్., అభయ ఆంజనేయ స్వామి అంటూ కొండంత రామబంటు ఆలయాలే దర్శనమిస్తాయి.
ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించనున్నారు. అయితే.. హనుమంతుని జన్మస్థలం అని నిర్ధారించడానికి విశేష కృషి జరిగింది. హనుమంతుని జన్మస్థలంగా తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరారు.
దీంతో టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి 2020 డిసెంబరులో పండిత పరిషత్ ఏర్పాటు చేశారు. ఈ పండిత పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసింది. జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించింది.
2021, ఏప్రిల్ 21న శ్రీరామనవమినాడు పూర్తి ఆధారాలతో హనుమంతుని జన్మస్థలం తిరుమల అని టీటీడీ నిరూపించింది. అప్పటి తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వారిలాల్ పురోహిత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా టీటీడీ అధికారులు విడుదల చేశారు. తరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించారు.
పురాణ ఆధారాలు అష్టాదశపురాణాల్లోని శ్రీ వేంకటాచల మాహత్యంలో స్పష్టంగా అంజనాద్రే హనుమ జన్మస్థలంగా ప్రతిపాదించబడింది. కృతయుగంలో వృషాద్రిగా, త్రేతాయుగంలో అంజనాచలంగా, ద్వాపరయుగంలో శేషశైలంగా, కలియుగంలో వేంకటాచలంగా తిరుమల ప్రసిద్ధి పొందిందని వ్యాస భగవానుడు ఉపదేశించాడు. అంజనాదేవి తపస్సు, వాయువు దేవుని కటాక్షంతో హనుమంతుడు జన్మించినట్లు స్కాంద, భవిష్యోత్తర, వరాహ, బ్రహ్మాండపురాణాల్లో వేంకటాచల మాహాత్మ్యఖండాల్లో వివరించబడ్డాయి.
వాఙ్మయ, శాసన ఆధారాలు వాఙ్మయ, శాసన ఆధారాల ప్రకారం వాల్మీకి రామాయణానికి తమిళ అనువాదమైన కంబ రామాయణం, శ్రీ వేదాంతదేశికులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తమ రచనల్లో వేంకటాద్రిగా అంజనాద్రిగా అభివర్ణించారు. స్టాటన్ అనే అధికారి క్రీ.శ. 1800 సంవత్సరంలో తిరుమల గుడి గురించిన విషయాలను సంకలనం చేసి సవాల్-ఏ-జవాబ్ అనే పుస్తకాన్ని రాశారు.
ఆ పుస్తకంలో అంజనాద్రి అని పదాన్ని వివరిస్తూ అంజనాదేవికి ఆంజనేయుడు పుట్టిన చోటు కావడం వల్ల అంజనాద్రి అన్నారని రాసినట్లు గుర్తించారు. వేంకటాచల మాహాత్మ్యం అనే గ్రంథం ప్రమాణమే అని చెప్పటానికి రెండు శిలాశాసనాలు తిరుమల గుడిలో దొరుకుతున్నాయి. ఇందులో మొదటి శాసనం 1491 జూన్ 27వ తేదీకి చెందినది, రెండవ శాసనం 1545 మార్చి 6వ తేదీకి చెందినదిగా గుర్తించారు.