స్కూబా డైవర్స్ అద్భుతాలు చేస్తున్నారు. సముద్రంలో సాహసాలు చేస్తున్నారు. సరదగా స్కూబా డైవింగ్ నేర్చుకున్నా కొంతమంది యువత ఇప్పుడ సాహసాలు చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి వెళ్తూ అన్వేషణ చేస్తున్నారు. వందల ఏళ్ల కిందటి ఆనవాళ్లను వెలుగులోకి తీసుకువస్తున్నారు. విశాఖను పర్యాటకానికి సరికొత్త అందాలు అద్దుతున్నారు.
తాజాగా వందేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలోని సముద్రంలో మునిగిపోయిన నౌకల ఆనవాళ్లను గుర్తించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర గర్భంలో దాగి ఉన్న చారిత్రక ఆనవాళ్లను కనుగొని బాహ్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఓ నౌక ఆనవాళ్లను గుర్తించిన లివిన్ అడ్వెంచర్స్ బృందానికి ఈ బాధ్యత అప్పగించింది.
బారువా తీరం చేరే సమయంలో షిప్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఈ నౌక మునిగిపోయింది. ఈ షిప్ తీరానికి ఎంత దూరంలో ఉంది, దాని శిథిలాలు ఎలా ఉన్నాయనే విషయాల్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇదే తరహాలో మరో రెండు చోట్ల నౌకలు మునిగిపోయినట్టు చరిత్ర చెబుతోంది. దీంతో శ్రీకాకుళం కలెక్టరేట్ వర్గాలు ఆ రెండుచోట్ల అన్వేషణ సాగించాలంటూ లివిన్ అడ్వెంచర్స్ సంస్థను సంప్రదించాయి
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు బీచ్కు కొంత దూరంలో విదేశీ నౌక వందేళ్ల క్రితం మునిగిపోయినట్టు చరిత్రలో ఉంది. ఈ షిప్ ఎంత దూరంలో మునిగిపోయింది, ఆ షిప్ ఏ దేశానికి చెందినది, అది కార్గోనా లేక ప్రయాణికులతో వెళ్లే నౌకా అనే వివరాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే వాటి ఆనవాళ్లను ఈ లివిన్ అడ్వెంచర్స్ సంస్థ వెలుగులోకి తీసుకురానుంది..
పోలాకి మండలం జోగంపేట తీరంలోనూ ఒక నౌక మునిగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944లో జరిగిన బాంబు దాడుల్లో ఒక నౌక జోగంపేట తీరంలో ధ్వంసమైనట్టు గుర్తించారు. దీని పేరు సిలికాన్ షిప్ అని తెలిసింది. అయితే.. ఈ షిప్ ఏ దేశానికి చెందినది, ఎంతమంది ప్రయాణికులతో వచ్చింది తదితర వివరాలేవీ వెలుగులోకి రాలేదు. ఈ రెండుచోట్ల సాగర గర్భంలో చిక్కుకున్న చరిత్ర ఆనవాళ్లని అన్వేషించేందుకు లివిన్ అడ్వెంచర్స్ సంస్థ సమాయత్తమవుతోంది.