P Anand Mohan, Visakhapatnam, News18. Nara Lokesh on ycp Government: విధ్వంసానికి జగన్ ఓ ట్రేడ్ మార్క్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. అన్ని రంగాలపైనా జగన్ గ్యాంగుల దాడి తో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా వుండటం జగన్కి ఇష్టంలేదని విమర్శించారు.
అసంబ్లీ వేదికగా తన తల్లిని దూషించిన ఏ ఒక్కడినీ వదలను అని హెచ్చరించారు. పోలీసులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే నో పోలీస్.. కానీ చెత్తపై పన్నేసిన చెత్తగాళ్లంటే అయ్యన్నపాత్రుడిపై కేసా వేస్తారా అని ప్రశ్నించారు. తనపై నా తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. అందుకే జగన్ పై న్యాయపోరాటం చేస్తున్నాను అన్నారు.
విశాఖపట్నం కోర్టులో కేసు విచారణ సందర్భంగా ఆయన వచ్చారు. ఆ కేసు 28వ తేదీకి వాయిదా పడగా, కోర్టు బయట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక పరిశ్రమలపైనా, ప్రజలపైనా, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి లాంటి వందల మందిపై దాడి చేశారని, ఇప్పుడు సినిమా పరిశ్రమపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ విధ్వంసకర పరిపాలన చూసి విశాఖకి రావాల్సిన అదానీ డేటా సెంటర్ ముంబైకి తరలిపోయిందన్నారు. ఒక్క కొత్త భవనం కట్టడం చేతకాక టీడీపీ ప్రభుత్వం కట్టిన భవనాల్లో ఉంటూ..? కొత్తగా మూడు రాజధానులు కడతామని డప్పు కొట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఐటీ అభివృద్ధి కోసం మేము మిలినీయం టవర్స్ కట్టిస్తే, అది కూడా ఖాళీ చేయించడమేనా విశాఖలో చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు.
అయ్యన్నపాత్రుడు ఏమన్నారని ఆయనని అరెస్టు చేయడానికి వేలాది మంది పోలీసులతో దిగారని లోకేష్ ప్రశ్నించారు. చేతగాని పాలన చేస్తున్న వారిని యూజ్లెస్ ఫెలో/ వేస్ట్ ఫెలో అనడం బూతా? నేరమా? అని నిలదీశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసుల్ని కించపరుస్తూ దాడులు చేస్తుంటే పోలీసులు స్పందించడంలేదు ఎందుకని నిలదీశారు.
వైసీపీకి ఓ ఐపీసీ సెక్షన్? టిడిపి మరో ఐపీసీ సెక్షన్? అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు అయ్యేవరకూ ఒక్క కేసూలేని తనపై 11 కేసులు బనాయించారని, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. దేశాన్ని దోచి జగన్లా జైలుకెళ్లలేదని, ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని అయినా తగ్గేదేలేదన్నారు.
వైసీపీ గెలిచిన నుంచి రాష్ట్రంలో యుద్ధవాతావరణం నెలకొందన్నారు. ఏపీలో నిజమైన టెర్రరిస్టులు, రౌడీలు వైసీపీ వారేనన్నారు. శాసన సభ సాక్షిగా నా తల్లిని దూషించారని, జగన్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందన్నారు. తన తల్లి ఎంత బాధపడింతో చూశానని, ఒక కొడుకుగా నా తల్లి ఆవేదనకి బదులు తీర్చుకునే తీరుతానన్నారు. తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టనని శపథం చేశారు.