P Anand Mohan, Visakhapatnam, News18. TTD Temple at Vizag: తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ ప్రాంతాల్లో ఆలయాలను నిర్మిస్తోంది. హిందూ ధర్మాన్ని విస్తరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించింది. అది కూడా ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందిన రుషికొండపై ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. ఏడు కొండలవాడి వైభవానికి ప్రతీకగా నిలిచేలా నిర్మాణాన్ని చేపట్టింది.
ఆలయ నిర్మాణం, ఘాట్ రోడ్డు, ఇతరత్రా సదుపాయాల కోసం సుమారు 28 కోట్లు నిధులు ఖర్చు చేసింది టీటీడీ. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అచ్చం తిరుమల ఆలయం మాదిరే.. విశాఖలోనూ వేంకటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శిల్ప కళాకారులు తయారుచేసిన శ్రీవేంకటేశ్వరస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీవారి పాదాలు, భూదేవి ఇతరత్రా విగ్రహాలను విశాఖకు తీసుకువచ్చారు. స్వామి వారి ఆభరణాలనూ పంపింది టీటీడీ.
ఈ ఆలయంలో నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఇద్దరు అర్చకులను నియమించింది. కొండ కింది భాగంలో టిక్కెట్ కౌంటర్లు, ప్రసాద కౌంటర్లు, కల్యాణోత్సవ వేదిక, కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ప్రారంభోత్సవం ఎప్పుడో జరగాల్సి ఉన్నా.. కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు టీటీడీ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
వాస్తవానికి ఆరునెలల క్రితమే ప్రారంభోత్సవానికి ముస్తాబైనా పలు కారణాల రీత్యా వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ అంకురార్పణ చేసి 23 వరకు ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతించనున్నారు. 23 న సంప్రోక్షణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. విశాఖ సాగర తీరం లోని ఋషికొండ లలో ఒక కొండపై 10 ఎకరాల స్థలంలో 28 కోట్ల వ్యయం తో టీటీడీ నిర్మించిన ఈ వేంకటేశ్వరుని ఆలయం అద్భుతంగా తీర్చిదిద్దబడింది.
ఈ ఆలయానికి ఎదురుగా తిరుమల తరహాలో ఆంజనేయస్వామి ఆలయాన్ని సైతం నిర్మించారు. ఇరువైపులా శ్రీదేవి, భూదేవి ఆలయాలను నిర్మించారు. టీటీడీ శిల్ప కళాకారులు తయారుచేసిన దేవతా విగ్రహాలను తిరుమల నుంచి విశాఖకు తీసుకువచ్చారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లేవారికి.. ఆధ్యాత్మిక భావన కలడంతో పాటు.. అందమైన సముద్రాన్ని చూసే అవకాశం కూడా ఉంటుంది.
నేటి నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 23 వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం టీటీడీ నుంచి ప్రత్యేకంగా సిబ్బంది విశాఖకు చేరుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు అంకురార్పణ, 7.30 గంటలకు కలశ స్థాపన, 21 మధ్యాహ్నం వేంకటేశ్వర స్వామి విగ్రహ స్థాపన, 22న సాయంత్రం 4.30 గంటలకు మహాశాంతి, అభిషేకం నిర్వహించనున్నారు.
23న ఉదయం 9.20 నుంచి 10.30 గంటల మధ్యలో మహా సంప్రోక్షణ తదితర పూజలు చేస్తారు. అదే రోజు సాయంత్రం 3 గంటలు నుంచి శ్రీమహాలక్ష్మి, గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. 23న జరిగే మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆలయ ప్రారంభానికి రావాలని దేవదాయ శాఖతో పాటు టీటీడీ కూడా సీఎంను ఆహ్వానించింది.
ఆలయం ప్రారంభమైన నాటి నుంచే టీటీడీ దివ్యక్షేత్రం వేంకటేశ్వరుని దివ్యదర్శనం, స్వామి సేవలతో పాటు లడ్డూలు అందుబాటులోకి రానున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లలేనివారు ఇక్కడ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ప్రసాదాలు, ప్రత్యేక పూజలు చేయ్యించుకోవచ్చు. తిరుమలలో ఎవిదమైన పూజలు నిర్వహిస్తారో ఇక్కడ కుడా అలాంటి సేవలను ఎర్పాటు చేశారు.