తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాంమని టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనంకు సామన్య భక్తులు ఎలాంటి సంకోచం లేకుండా తిరుమల యాత్రకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 7 నుండి 8 గంటల సమయం పడుతోందని, కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు, షెడ్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు.
రాంభగీచా బస్టాండు, సీఆర్వో, ఏఎన్సి తదితర ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్ల ఏర్పాటుతో భక్తులు అన్నప్రసాద కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లోనే అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారని తెలిపారు.పీఎసీ-2, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 క్యాంటీన్లో అన్నప్రసాదాల తయారీకి, వడ్డించేందుకు కలిపి 185 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నామన్నారు.
విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో క్యూలైన్ల క్రమబద్దీకరణతో పాటు భక్తుల లగేజీని కౌంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారని వివరించారు. ఇందుకోసం దాదాపు 100 మంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ప్రధాన కళ్యాణకట్టతో పాటు మినీ కల్యాణకట్టల్లో క్షురకులు 24 గంటల పాటు భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలియజేశారు.
కోవిడ్ సమయంలో 400 మంది క్షురకులు సేవలు అందిస్తుండగా, ప్రస్తుతం 1200 మంది సిబ్బంది భక్తులకు తలనీలాలు తీస్తున్నారని తెలిపారు. కళ్యాణకట్టలో శుభ్రం చేసేందుకు 40 మంది అదనపు సిబ్బందిని సమకూర్చుకున్నామని, రిసెప్షన్ విభాగంలో గదులు ఖాళీ అయిన 20 నిమిషాల్లో శుభ్రం చేసి భక్తులకు కేటాయిస్తున్నారని చెప్పారు.
అదేవిధంగా ఏప్రిల్ 11 నుండి 17వ తేదీ వరకు 5,29,926 మంది భక్తులు దర్శించుకున్నట్లు చెప్పారు.. 24,36,744 లడ్డూలు, 25,921 వడలు విక్రయించాంమని తెలిపారు.. 2,39,287 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 10,55,572 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు.. తిరుమలలో వివిధ విభాగాల్లో 1700 మంది, తిరుపతిలో 300, పరకామణి సేవ 200 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.