Tiruchanoor: శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి సైతం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తొలి రోజు ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభం కాగా.. రాత్రి అమ్మవారు చిన్న శేష వాహనంపై శ్రీ గోపాల కృష్ణుడి రూపంలో భక్తులకు అభయమిచ్చారు.
గజపట ప్రతిష్ఠ : ఆలయంలో ఉదయం అమ్మవారికి సుప్రభాతం నిర్వహించారు. ఇదే సమయంలో యాగశాలలో గజపట ప్రతిష్ఠ చేపట్టారు. గజ ప్రతిష్ఠలో భాగంగా గజధ్యాన శ్లోకం, గజ మంగళాష్టకం, గరుడ గద్యం వళ్లించి అపరాధ క్షమాపణం కోరారు. ఈ గరుడ గద్యం ప్రస్తావన కాశ్యప సంహితలో ఉంది. ఈ సందర్భంగా రక్షాబంధనం, ఛాయాధివాసం, ఛాయా స్నపనం, నేత్రోల్మీనలనం, తత్వన్యాస హోమం, ప్రాణప్రతిష్ట హోమం, పూర్ణాహుతి చేపట్టారు.
సకలదేవతలకు ఆహ్వానం :
ఆ తరువాత గజపటాన్ని ధ్వజారోహణ మంటపానికి తీసుకొచ్చారు. కంకణభట్టార్ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ధ్వజారోహణ ఘట్టంలో మొదటగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం నిర్వహించారు. నెయ్యి, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచగవ్యం, పాలు, పెరుగు, తేనె, పసుపునీటిని తొమ్మిది కలశాల్లో ఉంచి పరవాసుదేవ, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర దేవతలను ఆవాహన చేశారు.
ఆ తరువాత షోడషోపచారాలు నిర్వహించారు. చతుర్వేదాలను పారాయణం చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం తరువాత బ్రహ్మూత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. భూలోకం, సువర్ణ లోకం, పాతాళ లోకాల నుంచి దేవతలను ఆహ్వానించేందుకు గజపటం ఆరోహణం చేయడంతో ధ్వజారోహణ పర్వం ఘనంగా ముగిసింది.
తొలి రోజే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌ. శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.