Tiruchanoor:భారత దేశంలో ఎక్కడ లేని విధంగా మహాలక్ష్మి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.. తిరుచనూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు.. అమ్మవారు రెండు రూపాల్లో దర్శనం ఇచ్చారు. ఉదయం ముత్యపు పందిరిపై బకాసరు వధ రూపంలో అలమేలుమంగ భక్తులకు కటాక్షించారు. ఇక రాత్రి సింహ వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో లోకమాత భక్తులను అనుగ్రహించారు.
రాత్రి 7 గంటల నుండి వాహనసేవ సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు . సింహం పరాక్రమానికి, శీఘ్రగమనానికి, వహనశక్తికి ప్రతీక. అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తారు. శ్రీ పద్మావతి అమ్మవారు ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్రసాదిస్తారు.
ఈ వాహనసేవల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసచార్యులు, విఎస్వోలు శ్రీ మనోహర్, శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి , ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ దాము పాల్గొన్నారు.
మరోవైపు తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) మంగళవారం ఘనంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతోంది. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉధ్వాసన, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు.