Village Tradition: ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది కరోనా మహమ్మరి.. వివిధ దేశాలు చుట్టొచ్చిన వైరస్ భూతం.. ఇప్పుడు యావత్ భారత దేశాన్ని వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. పట్టణం నుంచి పల్లె వరకు దేన్నీ ఈ భూతం విడవడం లేదు. ఈ నేపథ్యంలో గో కరోనా గో అంటూ ఓ గ్రామం ప్రత్యేక జాతర నిర్వహించింది..
తమ ఊరికి కరోనా రాకుండా చూడమ్మా..! అంటూ ఆ గ్రామ దేవత అయిన అమ్మవారికి మొక్కులు మొక్కారు గ్రామస్థులంతా కలిసి. ఎందుకంటే తొలి రెండు దశల్లో కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడింది. ఎన్నో కుటుంబాలను రోడ్డుపై పడేసింది. పిల్లలను, పెద్దలను అనాథలుగా మార్చేసింది. అందుకే ఇకపై ఇలాంటి కష్టం రాకూడదని ఆ గ్రామస్థులు మొక్కుకున్నారు.
ప్రతి ఏడాది గ్రామంలో నిర్వహించే జాతర సందర్భంగా గ్రామస్థులు ఈసారి కరోనా బారిన పడకుండా కాపాడాలని మొక్కులు మొక్కారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామంలో జరిగింది ఈ జాతర. ఈ గ్రామదేవత కనకదుర్గమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 600 ఏళ్ల నుంచి ఇక్కడ అమ్మవారు పూజలందుకుంటూ ఉందని గ్రామస్థులు చెబుతున్నారు.