Cyclone Gulab Effect on Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ను గులాబ్ తుఫాను వణికించింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. జోరుమని వీచే గాలులు.. హోరుమని జోరు వాన.. ఇళ్ల నుంచి జనం బయకు రావాలంటనే భయపెట్టింది. తుపాను ముప్పు తప్పిందని ఊపిరి పీల్చుకుంటుండగా ఆదివారం అర్ధరాత్రి నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లోనూ పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. ఈ తుఫాను కారణంగా 277 మండలాల్లోనూ వానలు పడ్డాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 98 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో గంటకు 79 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉత్తరాంధ్రలో వేల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు, విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నదుల్లో ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. రోడ్లు, వంతెనల మీదుగా నీరు పారడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లతోపాటు విద్యుత్తు సబ్స్టేషన్లు, పోలీస్స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రుల్లోకి వరద నీరు చేరింది. తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. వరద ముంచెత్తడంతో విశాఖపట్నంలో వాహనాలు నీటమునిగాయి.
తుపాను ప్రభావంతో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా గారలో అత్యధికంగా 7 సెం.మీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు 13.4 సెం.మీ.కి చేరింది. ఆదివారం రాత్రి 11 గంటల వరకు శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. తర్వాత విశాఖపై గులాబ్ ప్రతాపం చూపింది. నగరంలోని టీటీడీ కల్యాణ మండపం ప్రాంతంలో 33.3 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. పెందుర్తి, గాజువాక, పరవాడ, పెదగంట్యాడ తదితర ప్రాంతాల్లో 24.5 సెం.మీ నుంచి 33.3 సెం.మీ మధ్య వర్షం కురిసింది.
భారీ వర్షాలకు విశాఖపట్నంలో వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. కొన్నిచోట్ల సోమవారం సాయంత్రానికి కూడా బయటకు పోలేదు. రహదారులపై నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు 10 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మన్యంలో గెడ్డలు పొంగిపొర్లాయి. జిల్లాలో 147 విద్యుత్తు సబ్స్టేషన్లపై తుపాను ప్రభావం చూపడంతో వందల గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. రైవాడ, కోనాం మినహా మిగతా అన్ని డ్యామ్ల గేట్లు ఎత్తి నీరు కిందకు విడుదల చేస్తున్నారు.
ఈదురుగాలులకు గార, శ్రీకాకుళం సహా తీర ప్రాంత మండలాల్లో భారీ సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. చాలా చెట్లు విద్యుత్తు తీగలపై పడడంతో విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. సోమవారం రాత్రి వరకూ శ్రీకాకుళం నగరం, గార, వంగర, కోటబొమ్మాళి సహా పలు మండలాల్లో విద్యుత్తుసరఫరా పునరుద్ధరణ కాలేదు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, గజపతినగరం, పూసపాటిరేగ ప్రాంతాల్లో గరిష్ఠంగా 23.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. వందలాది వృక్షాలు నేలకూలాయి. గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. సాలూరు మండలం మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా నీట మునిగి మందులు, పరికరాలు అన్నీ తడిచిపోయాయి.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, టి.నర్సాపురం, కామవరపుకోట, ఆచంట, పెనుమంట్ర, చింతలపూడి, పోడూరు, కొవ్వూరు, చాగల్లు, భీమడోలు, పెనుగొండ, గణపవరం తదితర ప్రాంతాల్లోనూ 12 సెం.మీ. పైగా వర్షం కురిసింది. కొండవాగులు పొంగి, పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం జల్లేరు వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. తాడిపూడి కాలువకు గండి పడటంతో చేబ్రోలు- దూబచర్ల రహదారి నీట మునిగింది.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం, తాళ్లరేవు, కాజులూరు, కడియం, రామచంద్రాపురం, అమలాపురం, పి.గన్నవరం, కాకినాడ, రాజమహేంద్రవరం, మండపేట, అంబాజీపేట ప్రాంతాల్లో 10 సెం.మీ నుంచి 16 సెం.మీ వానలు పడ్డాయి. రంపచోడవరం- గోకవరం ప్రధాన రహదారిలో జాగరంవల్లి వద్ద భారీవృక్షం నేలకూలడంతో రాకపోకలు స్తంభించాయి. మారేడుమిల్లి మండలంలో పెళ్లిరేవు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గర్భిణిని తీసుకెళ్తున్న అంబులెన్స్ నీటిలో నిలిచిపోయింది. స్థానికులు వాగు దాటించారు.
భారీ వర్షాల ధాటికి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గదబపేటలో చెట్టుకూలి ఒకరు, తమటాడలో గోడ కూలి మరొకరు చనిపోయారు. గుర్ల మండలం కోట గండ్రేడులో ప్రమాదవశాత్తు చెరువులోపడి ఒకరు మృత్యువాతపడ్డారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి అప్పలనరసయ్య కాలనీలో సోమవారం ఉదయం 37 ఏళ్ల భావన అనే మహిళ మరుగుదొడ్డిలో ఉండగా మరో ఇంటి గోడ కూలి మరుగుదొడ్డిపై పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సుజాతనగర్లో వర్షంతో విద్యుదాఘాతానికి గురై నక్కా కుశ్వంత్కుమార్ అనే ఏడేళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఇందిరానగర్లో 46 ఏళ్ల బోర వెంకటరమణ ఆదివారం రాత్రి తన టైలరింగ్ దుకాణం మూసివేసి ఇంటికి వస్తూ మురుగుకాలువలో పడి కొట్టుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు.
తుఫాను కారణంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ల్యాండింగ్కు వాతావరణం అనుకూలించక ఇండిగో సర్వీసు సుమారు గంటన్నరపాటు గాల్లో చక్కర్లు కొట్టింది. ఎయిర్ పోర్టు ప్రాంతం అంతా.. భారీ వర్షాలతో చెరువులను తలపిస్తోంది. మోకాళ్ల లోతు నీరులోనే ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఎయిర్ పోర్టులోకి చేరుకోవాల్సి వచ్చింది.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 750 కి.మీ. మేర ఆర్ అండ్బీ రహదారులు, 50 కల్వర్టులు దెబ్బతిన్నాయి. బొర్రా- చిమిడిపల్లి మార్గంలోని కేకేలైన్లో రైలు పట్టాలపైకి బురద కొట్టుకొచ్చింది. కొత్తవలసలో రైలు పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎల్కోట సమీపంలో కొత్తవలస-కిరండోల్ మార్గంలో ఒక లైన్ దెబ్బతింది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళికి భారీ ఎత్తున వరద పోటెత్తింది. 75వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో.. శ్రీకాకుళం నగరంతోపాటు ఆమదాలవలస, ఊర్జ మండలాల్లోని 20 గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. విశాఖపట్నంలో మేఘాద్రి జలాశయంలో నీటిమట్టం పెరగడంతో.. గేట్లు తెరిచి నీటిని వదిలారు. వెంగళరాయసాగర్ ప్రాజెక్టు గేట్లు పైకి లేవకపోవడంతో.. పై నుంచి నీరు ప్రవహించింది.
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో 1.57 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 6,465 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. చాలా మండలల్లో పైర్లు బాగా పండాయి.. ఈ ఏడాది మంచి పంట వస్తుందని ఆశించిన సమయంలో గులాబ్ కన్నీరే మిగిల్చింది. పంట మొత్తం నీట మునిగింది.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని రాష్ట్ర పోలీసు యంత్రాంగం మరోసారి నిరూపించింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేలకొరిగిన వృక్షాలు తొలగించడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు చేర్చడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు.
గులాబ్ తుపాను కారణంగా తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల పరిధిలో సంస్థకు వాటిల్లిన ప్రాథమిక నష్టం రూ.7.87 కోట్లుగా అధికారులు తేల్చారు. 213 ప్రత్యేక బృందాలతో యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో తుపాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడ భారీ నష్టం ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల్లో ఒక ఎక్స్ట్రా హైటెన్షన్ సబ్ స్టేషన్తో పాటు 33/11 కేవీ సబ్ స్టేషన్లు 380, ఫీడర్లు 276, స్తంభాలు 107, లైన్లు 10 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. 11 కేవీ ఫీడర్లు 1,623, స్తంభాలు 1,120, లైన్లు 51.19 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇంకా విద్యుత్ పునరుద్దరణ కాలేదు.
ఇప్పటికే గులాబీ బీభత్సం భయం ప్రజలను వీడలేదు. కానీ మరోసారి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు భయపెడుతున్నాయి. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈశాన్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు.