Gold Robbery: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఓ బంగారం జ్యువెలరీ షాపులో భారీ చోరీ సంచలనం రేపింది. అది కూడా విజయనగరం పట్టణం (Vizianagaram )లో ఈ చోరీ జరిగింది. అక్కడ ఎప్పుడు ఇంత భారీ చోరీ జరగలేదు. అది కూడా నిత్యం రద్దీగా ఉండే జంక్షన్ లో ఈ చోరీ జరగడం పోలీసుకు ఛాలెంజ్ గా మారింది. దీంతో ఈ కేసును విజయనగరం పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. రవి జ్యూవెలరీ షాపు(ravi jewellers Shop)లో చోరీ కేసును కేవలం 24గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితుడ్ని చత్తీస్ ఘడ్(Chhattisgarh) లో అరెస్టు చేశామన్నారు జిల్లా ఎస్పీ ఎం. దీపిక, ఐపిఎస్ వివరాలను వెల్లడించారు.
అసలు దొంగతనం ఎలా జరిగింది అంటే..విజయనగరంలోని కోళ్ళ బజారు దగ్గర గల రవి జ్యూవెలరీ షాపులో గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి, షాపులోగల 8 కిలోల బంగారు ఆభరణాలు... అంటే వాటి విలువ కోటి 36 లక్షలు ఉంటుందని అంచనా.. దీంతో తన షాపులో బంగారు ఆభరాణాలు పోయాయని.. షాపు యజమాని కోట రామ్మోహన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
షాపు ఓనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విజయనగరం 1వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఎం. దీపిక, విజయనగరం సబ్ డివిజన్ ఇన్ చార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, సిసిఎస్ పోలీసులు, క్లూస్ టీం నేర స్థలంను సందర్శించి, నేరం జరిగిన తీరును పరిశీలించారు. సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించి.. ఈ నేరానికి పాల్పడింది ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా అనుమానించి.. ఆ దిశగా విచరాణ ప్రారంభించారు.
దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి పంపారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం కబీర్ధాం జిల్లా కవర్ధా పట్టణంకు చెందిన లోకేష్ శ్రీవాస్ అనే పాత నేరస్థుడిని చత్తీస్ ఘడ్ పోలీసుల సహకారంతో అతని ఇంటి వద్దనే ఈ నెల 24న అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 6.181 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒక షాపు చోరీ కేసు కోసం పోలీసులు విచారణ చేపడితే.. ఆ షాపుతో పాటు సిఎంఆర్, పాండు జ్యూవెలరీ షాపు మరియు పద్మజ ఆసుపత్రి మెడికల్ షాపులో చోరీల మిస్టరీ కూడా వీడింది. ఈ చోరీలకు పాల్పడిన నిందితుడు అతని అవసరాలకు డబ్బులను ఖర్చు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఎం. దీపిక స్వయంగా పర్యవేక్షిస్తూ.. ఎప్పటికప్పుడు చత్తీస్ ఘడ్ పోలీసు అధికారులతో మాట్లాడుతూ, దర్యాప్తు బృందానికి దిశానిర్దేశం చేశారు.
నిందితుడు లోకేష్ శ్రీవాస్ 10వ తరగతి వరకు చదివినట్లు, మొదటి భార్య అనారోగ్యంకు బాగా అప్పులు చేసి, వైద్యం చేయించినప్పటికీ 2014లో చనిపోవడంతో, వాటిని తిరిగి పొందేందుకు తన స్నేహితుల సూచనలతో చోరీలకు పాల్పడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు ఒడిస్సా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో 11 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు.
నిందితుడి జైలులో ఉన్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన ఒక నేరస్థుడితో పరిచయం ఏర్పడి, అతని సలహాతో విజయనగరం పట్టణానికి జనవరి 16న మొదటిసారిగా వచ్చి పద్మజ ఆసుపత్రి లో చోరీకి పాల్పడ్డాడు. అదే విధంగా ఫిబ్రవరి 14న మళ్ళీ మరోసారి వచ్చి సి.ఎం.ఆర్.లో చోరీకి పాల్పడ్డాడు. మళ్ళీ ఫిబ్రవరి 21న విజయనగరం పట్టణం వచ్చి రెక్కీ నిర్వహించి, రవి జ్యూవెలరీ, పాండు జ్యూవెలరీ షాపుల్లో చోరీలకు పాల్పడ్డారన్నారు.