పేపర్ లీకేజీ కేసులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మాజీ మంత్రి నారాయణకు జిల్లా కోర్టు హుటాహుటిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి రిమాండ్ లేకుండానే ఆయనకు కోర్టులో ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక అబ్జర్వేషన్ చేశారు. దేశంలోనే బడా విద్యావేత్త కావడంతో నారాయణ అరెస్టు.. అది కూడా పేపర్ లీకేజీ కేసులో చోటుచేసుకోవడం ఇండియా అంతటా చర్చనీయాంశమైంది.
మాజీ మంత్రి నారాయణకు అరెస్టయిన కొద్ది గంటల్లోనే బెయిల్ లభించింది. నారాయణపై అభియోగాలకు సంబంధించి ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. వ్యక్తిగత పూచీకత్తుతో చిత్తూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి సులోచనారాణి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో మంగళవారం అరెస్టు చేసి చిత్తూరు తరలించడం తెలిసిందే.
కాగా, రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు నారాయణకు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి బెయిల్ ఆదేశాల్లో పేర్కొన్నారు. నారాయణకు బెయిల్ లభించిన అనంతరం ఆయన తరఫున న్యాయవాది మాట్లాడారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు పేర్కొన్నారు.
నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మేవిధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు.
హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించారు. నారాయణ కళాశాలల డీన్ బాలగంగాధర్ను తిరుపతిలో అరెస్టు చేశారు. నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో నారాయణను మంగళవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి వెల్లడించారు.
ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్లో కేసు నమోదైందన్నారు. చిత్తూరులో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాల్ప్రాక్టీసు ఘటనలో మాజీ మంత్రి నారాయణ, డీన్ బాలగంగాధర్ల పాత్రకు ఆధారాలున్నాయని తమ విచారణలో తేలిందని చెప్పారు. నారాయణ పాత్రను రుజువు చేసేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయా? అని అడగ్గా.. వాటి గురించి ఇప్పుడే చెప్పలేమని, కోర్టులో సమర్పిస్తామని తెలిపారు.
నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవి నుంచి నారాయణ కొన్నేళ్ల క్రితం తప్పుకొన్నారని ఆ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు కదా? అని ప్రశ్నించగా ఎస్పీ స్పందిస్తూ.. వారి వివరణ వింటామని, తదుపరి విచారణలో ఈ అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. మాల్ప్రాక్టీసులో చాలామంది వ్యక్తులు, కార్పొరేట్ పాఠశాలల ప్రమేయం ఉందని.. తెలుగు పేపర్ విషయంలో కొన్నేళ్లుగా వ్యవస్థీకృతంగా ఈ తంతు జరుగుతోందని చెప్పారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.. విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. నిందితులంతా గతంలో చాలావరకూ నారాయణ విద్యా సంస్థల్లో పని చేశారని.. ప్రస్తుతం అందులో కొందరు ఎన్ఆర్ఐ, చైతన్య, కృష్ణారెడ్డి చైతన్యలో ఉన్నారని చెప్పారు.