ఏపీలో కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు సంచలనం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన సర్కారు ఈ నెల 30వ తేదీ వరకు దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది. రైతు భరోసా కేంద్రాల దగ్గర సీసీఆర్సీ మేళాలను నిర్వహిస్తోంది.
పంట సాగుదారు హక్కు పత్రాల (CCRC) చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గడచిన రెండేళ్లలో 6,87,474 మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, 2021–22 వ్యవసాయ సీజన్కు సంబంధించి కొత్తగా మరో 5 లక్షల మందికి వాటిని జారీ చేయాలని నిర్ణయించింది. వీరందరికీ నిబంధనల ప్రకారం రైతు భరోసా, రాయితీపై విత్తనాలు, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, కనీస మద్దతు ధర వంటి ప్రయోజనాలను వర్తిస్తాయి.
ఈ చట్టం కింద 11 నెలల కాల పరిమితితో జారీ చేస్తున్న కౌలు హక్కు పత్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు రాయితీపై పొందడంతోపాటు తాము పండించిన పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం అందుతుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టిలతోపాటు అన్నివర్గాల కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, ఉచిత పంటల బీమా వంటి అన్ని పథకాల లబ్ధిని పొందే వెసులుబాటు కల్పించింది. భూ యజమానుల అంగీకారంతో ఇప్పటివరకు సీసీఆర్సీలు పొందిన కౌలు రైతులు తమ పత్రాలను రెన్యువల్ చేసుకోవడంతో పాటు మరో 5 లక్షల మందికి కొత్తగా సీసీఆర్సీలు జారీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
దీనికోసం మేళాలు నిర్వహిస్తోంది. మేళాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసి.. వాటిని వైఎస్సార్ రైతు భరోసా పోర్టల్లో అప్లోడ్ చేయించడం ద్వారా వారికి ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత వైఎస్సార్ రైతు భరోసా సాయం అందించాలని సంకల్పించింది. సాధ్యమైనంత ఎక్కువ మందికి భరోసా లబ్ధి చేకూర్చాలన్న సంకల్పంతో ఈ నెల 30వ తేదీ వరకు సీసీఆర్సీలు జారీ చేస్తారు.