(P.Srinivas,New18,Karimnagar)
కరీంనగర్(Karimnagar) జిల్లాలోని హుజూరాబాద్ (Huzurabad)నియోజకవర్గం గతేడాది నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etala Rajender)రాజీనామా నుంచి ఇవాళ్టి వరకు ఏదో విషయంలో హుజురాబాద్ నియోజకవర్గం పేరు వినిపిస్తూనే ఉంది. గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న రాజకీయ వైరుధ్యాల ప్రభావం మండలం లోని 18 గ్రామాలపై పడడం అత్యంత విచిత్రం అనే చెప్పాలి. జిల్లాలోని ఓ మండలంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఓ విభాగం అధికారులు సెలవులు పెట్టి వెళ్లి పోతున్నారు. ఒక పంచాయతీ కారణంగా తాము అన్యాయానికి గురవుతున్నామని మిగతా గ్రామాల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాంగ్ లీవ్ పెడుతున్న అధికారులు..
హుజూరాబాద్ నియోజకవర్గం అంటేనే రాష్ట్రంలో ప్రధాన చర్చకు కేంద్రీకృతమై ఉందన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇక్కడ నెలకొన్న రాజ కీయాల ప్రభావం అధికారులపై పడి అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడుతోంది. హుజూరాబాద్ మండలంలోని ఓ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు చేయవద్దంటూ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిళ్లు వచ్చాయి . అయితే బిల్లులు చేయాలని మరో పార్టీ ప్రజా ప్రతినిధి ఇదే సమయంలో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగి లీవ్ పెట్టాడు.
ఒత్తిడి తట్టుకోలేక..
తాజాగా సబ్ డివిజన్ స్థాయి అధికారి కూడా లాంగ్ లీవ్ పెట్టాడు. అధికార, విపక్ష నాయకుల ఆధిపత్య పోరు కారణంగా ఇప్పుడు అధికార యంత్రాంగం సెలవుపై వెళ్లే పరిస్థితి రావడం చర్చకు దారితీసింది . తాము చెప్పినట్టే నడుచుకోవాలని ఒత్తిడి చేస్తుండడంతో చేసేదేమి లేక అధికారులు సెలవులు పెట్టి విధులకు దూరంగా ఉంటున్నారు. ఇరు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్న తీరు వల్ల తమ ఉద్యోగా ముప్పు వాటిల్లుతుందనికు భయపడి పోతున్నారు.నేతల ఒత్తిడితో అధికారులు లాంగ్ లీవ్లు పెట్టడంతో అభివృద్ది అటకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులు సైతం సెలవులపై వెళ్లిపోయే అవకాశం ఉందంటున్నారు స్థానికులు.
రాజకీయ వైరుధ్యాలు..
గతంలో సంగతేమో కాని ఈ పరిస్థితుల వల్ల హుజూరాబాద్ నియోజక వర్గం సరికొత్త చర్చకు వేదికగా మారింది. ఒక గ్రామానికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య విభేదాలే ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని స్థానికులంటున్నారు. ఆ ఇద్దరి మధ్య పంచాయితీ ప్రభావం తమకు శాపంగా మారిందని మండలంలోని 18 గ్రామ పంచాయతీల సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు పూర్తిచేస్తే తమ చేతిలో డబ్బులు పడతాయని ఆశించారు. కానీ కేవలం ఒక పంచాయతీ పరిధిలోని నాయకులు మధ్య నెలకొన్న విభేదాల ప్రభావం తమపై పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్రెడ్డి మధ్య కోల్డ్ వార్కి తోడు ఇలాంటివి తోడైతే పరిస్థితి ఏమిటని ఆశ్చర్యానికి గురవుతున్నారు నియోజకవర్గ ప్రజలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana News