హత్రాస్: ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ పరిధిలోని ఝిగుర గ్రామానికి చెందిన 22 ఏళ్ల వివాహిత ఆగ్రాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడబిడ్డలు, ఒక మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. మూడు నిమిషాల తేడాతో ముగ్గురూ ఈ బయట ప్రపంచాన్ని చూశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడంతో హెల్త్ వర్కర్స్, నర్సులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ మహిళను ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఆ మహిళ బిడ్డలతో కలిసి ఊళ్లోకి రాగానే పండగ వాతావరణం నెలకొంది. తనకు ముగ్గురు పిల్లలు ఒకే కాన్పులో జన్మించడంపై ఆమె భర్త సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఆ బిడ్డలు ‘దేవుడిచ్చిన వరప్రసాదం’ అని ఒక్కమాటలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ ముగ్గురు పసి బిడ్డలను గ్రామస్తులు తదేకంగా చూశారు.
ఆ 22 ఏళ్ల వివాహితకు ఇంట్లో ఉండగా పురిటి నొప్పులొచ్చాయి. సహజ ప్రసవం కష్టమని భావించి ఆమెను ఆగ్రాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి ముగ్గురు బిడ్డలను క్షేమంగా తల్లి కడుపులో నుంచి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఒక్కో బిడ్డ మూడు నిమిషాల తేడాతో జన్మించినట్లు వైద్యులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mother, New born baby, Pregnant women, Uttar pradesh