news18-telugu
Updated: November 24, 2020, 1:36 PM IST
పిల్లలు పుట్టాలని పూజారులతో తొక్కించుకున్న 200 మంది మహిళలు (credit - twitter)
దాంపత్య జీవితం పరిపూర్ణం కావాలంటే సంతానం కలగాలని అందరూ భావిస్తారు. కొందరు పిల్లలు పుట్టక బాధ పడుతూ హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతుంటారు. కనిపించిన దేవుళ్లకు మొక్కుతుంటారు. మరికొందరు మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధమ్తారి జిల్లాలో జరిగింది. మనిషి తన మేథస్సుతో అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తూ కొత్త కొత్త ఆవిష్కరణలను కనిపెడుతున్న ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయన్న దానికి ఇదో పెద్ద ఉదాహరణ. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో ఈ మూఢనమ్మకాలకు అంతే లేదు. పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకంతో వందల మంది మహిళలు బోర్లా పడుకుని పూజారులు, మంత్రగాళ్లతో తొక్కించుకున్నారు. సంతాన లేమితో బాధపడుతున్న దాదాపు 200 మంది మహిళలను ఆశీర్వదించడానికి పూజారులు వారిపై నడుచుకుంటూ వెళ్లారు. ధమ్తారీ జిల్లాలోని అంగామోతి మాత దేవాలయం దగ్గర ఈ ఘటన జరిగింది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే జాతరకు వేల మంది తరలివస్తారు. ఈ ఏడాది కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
500 ఏళ్లుగా కొనసాగుతున్న మూఢనమ్మకం:
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అక్కడ ప్రజల మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ ఘటన ‘మాధై మేళా’ (మాధై ఫెయిర్)లో జరిగింది. ఇది సాధారణంగా ప్రతి ఏడాది దీపావళి తరువాత వచ్చే మొదటి శుక్రవారం జరుగుతుంది. అక్కడ ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివచ్చి అంగార్మోటి దేవిని ప్రార్థిస్తారు. ఈ ఘటనపై అక్కడి స్థానిక అధికారులు స్పందిస్తూ ‘‘ఈ మూఢనమ్మకం 500 సంవత్సరాలుగా కొనసాగుతోంది. స్థానికులు తమ సంప్రదాయంలో భాగంగా ఈ మూఢనమ్మకాన్ని గట్టిగా నమ్ముతున్నారు. దీనిలో పాల్గొన్న తర్వాత చాలా మంది మహిళలు గర్భం దాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు.’’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: Immunity: అసలే చలికాలం... పైగా కరోనా... రోజూ ఇవి తింటే జలుబు, దగ్గు, కఫం పరార్
వైరల్ అయిన వీడియోలో, సుమారు 200 మంది మహిళలు నేల మీద పడుకోగా పూజారులు మంత్రాలు జపిస్తూ, బ్యానర్లు పట్టుకుంటూ వారి వీపుపై నడుస్తూ కనిపించారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిషన్ చైర్పర్సన్ కిరణ్మయ్య నాయక్ మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఆచారాలను నేను ఆమోదించను. ఈ చర్యలు సమాజానికి హానికరం. ఈ మూఢానమ్మకాలను నమ్మడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడానికి త్వరలోనే గ్రామాలను సందర్శిస్తాను.”అని చెప్పారు.
Published by:
Krishna Kumar N
First published:
November 24, 2020, 1:36 PM IST