డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే కొన్ని రోజుల ముందే అమెరికాలో అరుదైన ఘటన జరుగనుంది. గత 67ఏళ్లలో తొలిసారిగా ఓ మహిళకు ఆ దేశం ఉరిశిక్ష అమలు చేయనుంది. జనవరి 12న ఆమెకు మరణశిక్ష పడనుంది. ఇంతకీ ఆమె ఎవరు?, చేసిన నేరమేంటంటే..?
లిసా మోంట్గోమెరీ అనే మహిళ 2004లో దారుణానికి ఒడిగట్టింది. ముస్సోరిలో బోబి స్టినెట్ అనే గర్భవతిని పాశవికంగా హత్య చేసింది. కడుపులోని పేగును కొసి ఎనిమిది నెలల పసి కందును బయటికి తీసింది. ఆ బిడ్డ బతికినా.. బోబీ చనిపోయింది.
ఆ తర్వాత జీవించి ఉన్న ఆ బిడ్డను తండ్రికి పోలీసులు అప్పగించారు. తర్వాత లిసా మోంట్గోమరీని అరెస్ట్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి చేపట్టే ఎనిమిది రోజుల ముందే లిసాకు మరణశిక్ష అమలు కానుంది. 1953 తర్వాత అమెరికాలో ఓ మహిళను ఉరి తీయడం ఇదే మొదటిసారి కానుంది. కాగా అధ్యక్ష బాధ్యత బదిలీ సమయంలో మరణ శిక్ష అమలు కానుండడం వందేళ్ల తర్వాత జరుగనుంది.
కాగా మోంట్గోమెరికీ ఈనెల 8నే ఉరిశిక్ష పడాల్సింది. అయితే ఇద్దరు అటార్నీలకు కరోనా సోకడంతో ఆమె శిక్షను 2021 జనవరి 12కి అటార్నీ జనరల్ విలియమ్ బార్ వాయిదా వేశారు. కాగా ఉరి శిక్షను ఆపాలని వైట్ హోస్ను డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
మరోవైపు మోంట్గోమెరీ శారీరక, మానసిక వ్యాధులతో, ఒత్తిడితో బాధపడుతోందని ఆమె లాయర్ వాదిస్తున్నారు. ఆమె గతంలోనూ లైంగిక వేధింపులకు గురైందని, అప్పుడు ఆమెను ప్రభుత్వం కాపాడలేకపోయిందని చెబుతున్నారు. ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ప్రస్తుతం అమెరికాలో మరణశిక్ష పడిన ఖైదీలు 52 మంది ఉన్నారు. ఒకవేళ అమెరికా తర్వాతి అధ్యక్షుడు తలుచుకుంటే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో అన్నీ రద్దు చేయవచ్చు. అలాగే తాను మరణశిక్షలకు సముఖంగా లేనని బైడెన్ కూడా చెప్పారు. అయితే ఆయన బాధ్యతలు చేపట్టే ముందే ఆ జాబితాలో ఉన్న ఏకైక మహిళ మోంట్గోమెరీకి ఉరిశిక్ష అమలు జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.