UNCLE AUNT WHO GOT MARRIED FOR SECOND TO DAUGHTER IN LAW IN MADHYA PRADESH SNR
Video Viral:మధ్యప్రదేశ్లో కొడుకు చనిపోతే కోడలిని అత్తామామ ఏం చేశారో ఈ వీడియో చూడండి
Photo Credit:Youtube
Video Viral:మధ్యప్రదేశ్లో కోడలి విషయంలో చేసిన పనికి అత్తా,మామ అందరి మన్ననలు పొందుతున్నారు. కొడుకు కరోనాతో చనిపోతే ఒంటరిగా ఉన్న కోడలి భవిష్యత్తుతో పాటు సంతోషాన్ని తిరిగి ఇచ్చారు. కోడలికి అత్తమామలు ఇచ్చిన గిఫ్ట్ వీడియోనే వైరల్ అవుతోంది.
అత్త ఓ అమ్మేనని నిరూపించుకోవడం చాలా అరుదు. ఎక్కడైనా కొడళ్లపై పెత్తనం చెలాయించడం, వాళ్లను కాళ్ల కింద తొక్కిపట్టి ఉంచడం, కొడుకును కీలుబొమ్మను చేసి కోడళ్లను రాచి రంపాన పెట్టడం సమాజంలో సహజంగా చూస్తున్నాం. కాని మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఓ అత్త,మామలు తమ కోడలి పాలిట తల్లిదండ్రుల అవతారమెత్తారు. ఒకరకంగా ఈ వార్త అందరికి విచిత్రమైనదిగా చూస్తారు కాని ఆదర్శంగా భావించాలని వాళ్లు ఇలా చేశామని చెప్పండతో వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. వాళ్లు చేసిన గొప్ప పనికి సంబంధించిన వీడియో తెగ వైరల్(Video Viral)అవుతోంది. మధ్యప్రదేశ్ ధార్(Dhar)లో జరిగిన సంఘటన అందరికి కనువిప్పు కలిగించేలా ఉంది. ప్రకాష్తివారి, రాణిగి తివారి దంపతులకు ఒకే ఒక్క కొడుకు. అతనికి వివాహం చేశారు. కొడుకు , కోడలు హాయిగా ఉంటున్న సమయంలో ప్రకాష్తివారి కొడుకు కరోనా(Corona)తో గతేడాది చనిపోయాడు. చిన్నవయసులో కొడుకు చనిపోవడం, వృద్ధాప్యంలో ఉన్న తమకు తోడు ఉండాలన్న ఆలోచనతో కోడలిని తమ దగ్గరే ఉంచుకున్నారు. ఇలాగే కొన్ని రోజులు గడిన తర్వాత ఏదో ఒక రోజు తాము చనిపోతే కోడలు ఒక్కతే ఒంటరిగా మిగిలిపోతుందే ఓ మంచి ఆలోచన వాళ్లకు కలిగింది. అందుకే కొడుకు దూరమైన తామెంత బాధపడుతున్నామో..భర్త లేని కోడలు అంతే బాధపడుతోందని భావించి ఆమెకు మరో పెళ్లి చేయడానికి సిద్దపడ్డారు. ఈవిషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు తలెత్తకుండా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహాలు తీసుకొని కోడలిని కూతురుగా దత్తత తీసుకొని కన్యాదానం చేశారు ప్రకాష్తివారి(Prakashtivari), రాగిణి తివారి (Ragini Tiwari)దంపతులు.
అత్తామామ కాదు అమ్మానాన్న..
సుమారు రెండేళ్ల క్రితం కొడుకు, కోడలు అన్యోన్యంగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు తివారి దంపతులు. మళ్లీ తమ కోడల్ని అంతే బాగా చూసుకునే అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలని ఎన్నో సంబంధాలు చూసి చివరకు బంధువులకు చెందిన ఓవ్యక్తితో నిశ్చితార్ధం చేసుకున్నారు. తమ కోడల్ని కూతురుగా భావించి ఆమె ఇష్ట ప్రకారం అత్త,మామలే పెళ్లి పెద్దలుగా నిలబడి వివాహం చేశారు.
మంచి మనసుతో..
జీవితంలో ఎవరైనా చనిపోవాల్సిందే. అలాంటప్పుడు బ్రతికున్న నాలుగు రోజులు ఎదుటి వాళ్ల ఆనందం కోరుకుంటే తప్పేముందంటున్నారు తివారి దంపతులు. మాకే ఒక కూతురు ఉంటే..ఇలాగే కరోనాతో అల్లుడు చనిపోతే మేము కూడా ఇంతే బాధపడేవాళ్లం కాద అంటున్నారు. తమ బిడ్డ చనిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒంటరి జీవితాన్ని అనుభవించిన కోడలు ఇకపై సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్న సదుద్దేశంతోనే ఇలా రెండో వివాహం జరిపించామని తెలిపారు. మేం చేసిన పనిని మనస్పూర్తిగా అందరూ స్వాగతించాలని..ఇలాంటి కార్యక్రమం మరికొందరికి స్పూర్తిని కలిగించాలన్న ఆలోచనతోనే ఇలా ముందుకొచ్చామని ప్రకాష్తివారి, రాగిణి తివారి ఆనందభాష్పాలు కారుస్తూ చెప్పారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.