దసరా సెలవల నేపథ్యంలో స్వస్థలాలకు చేరుకునే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సాధారణ ప్రయాణికులకు స్టేషన్లలోకి అనుమతి లేదని ఈ సందర్భంగా తెలిపారు. కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టన్స్ పాటించేలా రిజర్వేషన్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ లేకుండా అనవసరంగా స్టేషన్ కు రావద్దని ఆయన సూచించారు. అయితే పండుగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని సూచించారు. స్టేషన్లో ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని పేర్కొన్నారు.
అయితే రైల్వే స్టేషన్లో బుకింగ్ సదుపాయం ఉందని, ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వడం లేదన్న ఆయన, భోజనం కూడా ఇంటి నుంచే తెచ్చుకుంటే మంచిదని సూచించారు. అయితే క్యాటరింగ్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణీకులంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, స్టేషన్లో నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు ప్రతి ఒక్కరూ స్టేషన్ పరిసరాలతోపాటు రైళ్లలో సైతం మాస్కు ధరించాల్సి ఉంటుందన్నారు.

ప్రత్యేక రైళ్ల టైంటేబుల్
రైలు వచ్చే సమయం కన్నా 90 నిమిషాలు ముందుగా స్టేషన్కు రావాలని, రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నవారికి అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే రైలు ఎక్కేందుకు వీలుంటుందని, కరోనా పాజిటివ్ అని తేలితే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆరోగ్య సేతు మొబైల్ యాప్ను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు.
Published by:Krishna Adithya
First published:October 19, 2020, 19:05 IST