Sleep at Office : రాత్రి పూట ఎన్నిగంటలు నిద్రపోయినా మధ్యాహ్నం కొద్ది సేపైనా నిద్రపోకుండా కొందరు ఉండలేరు. మధ్యాహ్నం భోజనం తర్వాత వారికి ఆటోమెటిక్ గా నిద్ర వచ్చేస్తుంది. అయితే ఈ నిద్రవల్ల చాలా బద్ధకంగా తయారౌతారని కొందరు చెబుతుంటారు. కానీ.. బద్ధకం మాట పక్కన పెడితే.. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతే వారికి మెమరీ పవర్ పెరుగుతుందట. కనీసం అరగంట నుంచి గంటపాటు నిద్రపోతే పిల్లలతోపాటు పెద్దలకు కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఓ సర్వేలో.. మధ్యాహ్నం గంట నిద్రపోయేవారు ఫిజికల్ గానూ, మెంటల్ గాను ఆరోగ్యంగా ఉంటారని తేలింది. దాదాపు అందరూ భోజనం ఒంటిగంటకు చేస్తారు. అయితే రెండు గంట నుంచి 3 గంటల మధ్యలో నిద్రపోవాలట. మధ్యాహ్నం నిద్రకు ఇదే కరెక్ట్ సమయమట. మధ్యాహ్నం 26 నిమిషాల కునుకుతో మన పెర్ఫార్మెన్స్ 33 శాతం పెరుగుతుందని నాసా అధ్యయనంలో తేలింది.. ఈ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుందని హార్వర్డ్ పరిశోధన వివరించింది.. అంతేకాదు, ఇది జ్ఞాపకశక్తి, శ్రద్ధ, సృజనాత్మకత, ఉత్పాదకత పెరుగుదలకు సహకరిస్తుందని తేలింది.
అయితే, ఆఫీసుల్లో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. అందుకే కార్యాలయాల్లో నిద్రకోసం కొంత సమయం కేటాయించాలని సూచిస్తున్నారు. తాజాగా, ఓ స్టార్టప్ సంస్థ ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుంది. మధ్యాహ్నం ఓ అరగంట పాటు ఉద్యోగులందరూ విశ్రాంతి తీసుకునేలా అధికారిక న్యాప్ టైం అవర్ ను తీసుకొచ్చింది. బెంగళూరుకి చెందిన పరుపులు, సోఫాల తయారీ వ్యాపారం నిర్వహిస్తోన్న స్టార్టప్ కంపెనీ వేక్ ఫిట్ (WakeFit)ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం వేక్ ఫిట్ సహ వ్యవస్థాపకుడు చైతన్య రామలింగెగౌడ నుంచి ఉద్యోగులకు "ఆఫీసులో నిద్రపోయే హక్కును ప్రకటిస్తున్నాం" అనే ఓ ఈ మెయిల్ వచ్చింది. మెయిల్ చూడగానే ఉద్యోగులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ మెయిల్ లో " మేము ఆరు సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నప్పటికీ ఇంకా కీలకమైన విశ్రాంతి అంశానికి చెందిన మధ్యాహ్నం నిద్ర విషయంలో న్యాయం చేయడంలో విఫలమయ్యాం.. మేము ఎల్లప్పుడూ నిద్రను సీరియస్ గా తీసుకుంటాం.. ఈ రోజు నుంచి ఉద్యోగులకు నిద్రకు కొంత సమయం కేటాయిస్తున్నాం. సంస్థలో ఉద్యోగులందరికీ మధ్యాహ్నం 2-2:30 గంటల వరకు 30 నిమిషాలు అధికారిక న్యాప్ టైం ఇవ్వాలని నిర్ణయించాం. ఇక నుంచి ఆఫీసులో నిద్ర పోయే హక్కును మీరు పొందుతారు.. అందుకు తగినట్లుగా వర్కింగ్ క్యాలెండర్లో మార్పులు కూడా చేశాం. ఇందుకోసం న్యాప్ పాడ్స్, ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేయనున్నాం" అని పేర్కొన్నారు.
భోజనం విరామం గంటతో పాటు అదనంగా నిద్రకు మరో అరగంట కేటాయించడం మంచి పరిణామం అని ఉద్యోగలు అంటున్నారు. ప్రస్తుతం ఈ మెయిల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, గతంలో వేక్ ఫిట్ స్లీప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన వార్తల్లో నిలిచింది. డబ్బు సంపాదనకు ఒక ప్రత్యేకమైన ఉపాధి అవకాశంగా దీనిని పేర్కొంది. ఓ వ్యక్తి వరుసగా 100 రోజులు ప్రతి రాత్రి 9 గంటల పాటు ఏకధాటిగా నిద్రపోవడమే ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.