బోర్డర్.. అంటే రెండు దేశాల మధ్య విభజన ఉండే ప్రాంతమని అందిరకీ తెలుసు. కొందరికైతే ఆ పదం వింటే బాలీవుడ్ సినిమా కూడా గుర్తు రావొచ్చు. ఇప్పుడు మాత్రం బోర్డర్.. అని పిలిస్తే ఒకడు నిజంగానే పలుకుతాడు. 75 ఏళ్ల కిందట విడిపోయిన ఇండియా-పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా ఎన్నోరకాల ఘటనలు జరిగినా, మొన్న డిసెంబర్ 2న చోటుచేసుకున్న దృశ్యం మాత్రం చాలా అరుదైనది. ఓ మహిళ భారత్, పాక్ సరిహద్దులో పురుడుపోసుకుంది. పండంటి మగ బిడ్డను కని, వాడికి ‘బోర్డర్’అని పేరు పెట్టుకుంది. పాకిస్తాన్ కు చెందిన ఆ హిందూ మహిళ కొద్ది నెలలుగా సొంత దేశంలోకి వెళ్లేందుకు పడిగాపులు కాస్తోంది. ఆమె ఒక్కతే కాదు.. లాక్ డౌన్ సమయంలో ఇండియాలో చిక్కుకుపోయిన దాదాపు 100 మంది పాక్ పౌరులు తిరిగి సొంత దేశం పోలేక అటారి-వాఘా సరిహద్దులో టెంట్ల కింద జీవనం సాగిస్తున్నారు. ఆ వంద మందిలో కొందరు పిల్లలు ఇండియాలోనే పుట్టారుమరి..
దేశ విభజనకు, గడిచిన 75 ఏళ్లలో పలు మార్లు యుద్ధాలకు, ఉద్రిక్తతలకు కారణాలు ఎలా ఉన్నా, అటు ఇటుగా విడిపోయిన వేలకొద్దీ కుటుంబాలు ఇప్పటికీ తమవాళ్లను చూసుకునేందుకు తహతహలాడుతుంటాయి. పాకిస్తాన్ లోని హిందువులైతే.. భారత్ లోని ఆథ్యాత్మిక క్షేత్రాలను ఎప్పుడు దర్శించుకోవాలాని ఉవ్విళ్లూరుతుంటారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజన్ పూర్ జిల్లాకు చెందిన బాలమ్ రామ్, నింబూ బాయి దంపతులు కూడా ఆ కోవలోకే వస్తారు. హిందువులైన నింబూ బాయి కుటుంబీకులు.. ఆలయాల సందర్శనతోపాటు ఇక్కడున్న తమ బంధువులను కలిసేందుకు భారత్ వచ్చారు. దర్శనాలు, పరామర్శలు ముగిశాయనుకునేలోపే లాక్ డౌన్ ముంచుకొచ్చింది. దీంతో నెలలపాటు ఆ 97 మంది భారత్ లోనే చిక్కుకుపోయారు. ఈలోపు కొందరు మహిళలు పిల్లల్ని కూడా కనేశారు. లాక్ డౌన్ ఎత్తివేత తర్వాత వారంతా తిరిగి సొంత దేశానికి బయలుదేరారు. కానీ వాళ్లను సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లే అడ్డుకున్నారు.
నింబూ దేవి, బాలమ్ రామ్ దంపతులతోపాటు 97మంది పాక్ హిందువులు భారత్ లోకి వచ్చేటప్పుడు అవసరమైన అనుమతులు అన్నీ తీసుకున్నారు. కానీ ఆ పత్రాల గడువు ముగియడం, కొత్తగా పిల్లలు పుట్టిన కారణంగా సరైన ధృవీకరణ లేనిదే లోనికి రానీయబోమంటూ పాక్ సైనికులు వారిని అడ్డుకున్నారు. దీంతో దాదాపు మూడు నెలలుగా వారంతా అటారీ-వాఘా సరిహద్దు వద్దే పడిగాపులు కాస్తున్నారు. అలారీ బోర్డర్ వద్ద భారత్ వైపు పార్కింగ్ స్థలంలో చిన్న టెంట్లు వేసుకుని ఆ 97 మంది బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆ చోటుకు దగ్గర్లోని గ్రామస్తులు వారికి ఆహారం అందిస్తున్నారు. ఈలోపే..
భారత పర్యటనలో ఉన్నప్పుడే నీళ్లోసుకున్న నింబూ దేవి.. ఏడు నెలల గర్భంతో స్వదేశం పాక్ వెళ్లేందుకు అనుమతి లభించలేదు. దీంతో కుటుంబీకులతోపాటు ఆమె కూడా టెంట్లలోనే జీవిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 2న ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. బంధువులైన ఇతర మహిళలు, అటారీ గ్రామానికి చెందిన మహిళలు కలిసి ఆమెకు పురుడుపోశారు. పండంటి మగ బిడ్డ పుట్టగా, వాడికి ‘బోర్డర్’అని పేరు పెట్టామని తల్లిదండ్రులు చెప్పారు. అనూహ్యంగా సరిహద్దులో చిక్కుకుపోయిన తమను అటు స్వదేశీయులు రానీయక, ఇటు భారత్ సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో మేం ఏ దేశానికి చెందినవాళ్లమవుతామో అర్థం కావట్లేదంటూ రోదిస్తున్నారు. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ లోని హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్ మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలులో ఉన్నప్పటికీ, అది 2014 కంటే ముందే ఇక్కడికొచ్చి స్థిరపడినవారికి లేదా బోర్డర్ ఇవతల ఉన్నోళ్లకు వర్తిస్తుంది. మరి మొన్ననే పుట్టిన బోర్డర్.. తన సొంత దేశం పాకిస్తాన్ వెళతాడో, లేక భారతే అక్కున చేర్చుకుంటుందో చూడాలి. హిందువులనే కాదు, భారత్ నుంచి తిరిగెళ్లేటప్పుడు కొత్తగా పిల్లల్ని కన్న ముస్లిం మహిళల్ని సైతం పాకిస్తాన్ అనుమతించని ఘటనలు చాలా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India pakistan border, Pakistan, Women