కంటికి కనిపించని దేవుడికన్నా ప్రాణం పోసే డాక్టర్లే గొప్పవారని చాలామంది భావిస్తారు. అలాంటి వైద్యుడు ఒకరు క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స అందించినందుకు తీసుకోవాల్సిన ఫీజును మాఫీచేసి నిజమైన దేవుడు అనిపించుకున్నాడు. దీంతో అమెరికాలో నివసించే ఆ పాకిస్థాన్- అమెరికన్ డాక్టర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. దాదాపు 200 మంది క్యాన్సర్ రోగులు చెల్లించాల్సిన రూ.4.75 కోట్ల హాస్పిటల్ బిల్లులను రద్దు చేసి వార్తల్లో నిలిచారు ఒమర్ అతిక్. ఆయన ఒక ఆంకాలజిస్ట్. ప్రస్తుతం ఒక బిల్లింగ్ కంపెనీతో కలిసి పనిచేస్తున్నాడు. ఒకప్పుడు తనవద్ద క్యాన్సర్కు చికిత్స తీసుకున్న రోగులు తన క్లినిక్కు భారీగా బకాయిలు పడ్డట్టు గుర్తించాడు. దీంతో మెడికల్ బిల్లులు చెల్లించలేని వ్యక్తుల బిల్లులను రద్దు చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. తన మాజీ రోగుల సంతోషం కోసం ఈ పని చేశానని ఆయన చెబుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక నోట్తో వారందరికీ గ్రీటింగ్ కార్డులు కూడా పంపించాడు. వారు క్లినిక్కు చెల్లించాల్సిన అన్నిరకాల బ్యాలెన్స్లను వదులుకోవాలని నిర్ణయించుకున్నట్లు గ్రీటింగ్ కార్డు నోట్లో అతడు రాశాడు.
డాక్టర్ అతిక్ 29ఏళ్లుగా అమెరికాలోని పైన్ బ్లఫ్లో (Pine Bluff) అర్కాన్సాస్ క్యాన్సర్ క్లినిక్ (Arkansas Cancer Clinic)ను నిర్వహిస్తున్నాడు. అక్కడ చికిత్స తీసుకునే రోగుల్లో చాలామందికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ ఇతర ఫీజుల రూపంలో కొంతమంది రోగులు చెల్లించాల్సిన బిల్లులు అలాగే ఉండిపోయాయి. తాజాగా తన క్లినిక్ను మూసివేయాలని అతిక్ నిర్ణయించాడు. దీంతో పేషెంట్ల బకాయిలను కూడా మాఫీ చేయాలని భావించాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్నవారు హాస్పిటల్ బిల్లుల గురించి ఆలోచిస్తూ, ఆందోళన చెందుతున్నారని అతడు గుర్తించాడు. చికిత్స కోసం డబ్బులన్నీ ఖర్చుచేసి ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంతోమంది వ్యక్తులను అతిక్ తన కెరీర్లో చూశాడు. తనకు కూడా ఇది అసౌకర్యంగా అనిపిస్తోందని ఆయన తెలిపాడు. దీంతో తన కుటుంబసభ్యులతో చర్చించి బిల్లులను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు అతిక్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.