కొట్టాయం: ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. అందులో వింతేముందని అనుకోకండి. వీళ్ల గురించి పూర్తిగా తెలిస్తే అరుదైన అక్కాచెల్లెళ్లని అనిపించక మానదు. ఇక.. విషయానికొస్తే.. కేరళలోని కొట్టాయంకు చెందిన శ్రీప్రియ, శ్రీలక్ష్మి కవలలు. అందుకే.. వీరి పేర్లు కూడా ఒకే అక్షరంతో మొదలయ్యేలా తల్లిదండ్రులు పెట్టారు. వీళ్లిద్దరికీ ఒకే రోజు, ఒకే పెళ్లి మండపంలో వివాహం జరిపించారు. అంతేకాదు.. ఇప్పుడు ఇద్దరూ ఒకే రోజు బిడ్డలకు జన్మనిచ్చారు. కొట్టాయంలోని కేరిటస్ హాస్పిటల్లో నవంబర్ 29న ఈ కవల అక్కాచెల్లెళ్లు బిడ్డలకు జన్మనిచ్చి మాతృత్వంలోకి అడుగుపెట్టారు.
శ్రీప్రియ, శ్రీలక్ష్మి 1995, అక్టోబర్ 11న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు అంబికా దేవి, చంద్రశేఖరన్ నాయర్. శ్రీప్రియ, శ్రీలక్ష్మి చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. కవలలు కావడంతో ఇద్దరికీ ఒకే రకమైన దుస్తులను తల్లి కొనేది. అలా ఒకే రకమైన దుస్తులు ధరించిన వీరిలో శ్రీప్రియ ఎవరో, శ్రీలక్ష్మి ఎవరో గుర్తుపట్టడం బంధుమిత్రులకు చాలా కష్టమైపోయేది. ఇద్దరూ నర్సరీ నుంచి సీఏ వరకూ కలిసే చదువుకున్నారు. డిసెంబర్ 11, 2020న ఇద్దరి పెళ్లి ఒకే వేదికపై, ఒకే ముహూర్తానికి జరిగింది. కొల్లాంకు చెందిన శ్రీప్రియ భర్త వినూప్.పి కోయంబత్తూరులోని Parle-G కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. శ్రీలక్ష్మి భర్త ఆకాష్ నాథ్ తిరువనంతపురంలో సూపర్మార్కెట్ నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఈ అక్కాచెల్లెళ్లు పెళ్లి కారణంగా ఒకరు ఒక జిల్లాలో, మరొకరు మరొక జిల్లాలో ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ కొల్లాం, తిరువనంతపురం ఇరుగుపొరుగు జిల్లాలు కావడంతో పెళ్లి తర్వాత కూడా వాళ్లింటికి వీళ్లు వెళ్లడం, వీళ్లింటికి వాళ్లు రావడం జరుగుతుండేది. శ్రీప్రియ, శ్రీలక్ష్మి రోజూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేసుకునేవారు.
తల్లి కాబోతున్న విషయం ఒకరికొకరు చెప్పుకుని సంతోషపడ్డారు. అమ్మ అనే పిలుపు కోసం పరితపించారు. ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో పురుడు పోసుకోవాలని నిర్ణయించుకుని కొట్టాయంలోని హాస్పిటల్లో చేరారు. శ్రీప్రియ నవంబర్ 29న మధ్యాహ్నం 2.20 నిమిషాలకు బిడ్డకు జన్మనివ్వగా, శ్రీలక్ష్మి అదే రోజు సాయంత్రం 6.20 నిమిషాలకు ప్రసవించింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. మూడు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి వెళ్లిపోయారు.
ఏదేమైనా ఇలా అక్కాచెల్లెళ్లు ఇద్దరికీ ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పెళ్లి కావడం, ఒకే రోజు ఇద్దరూ అమ్మలయ్యే భాగ్యం దక్కడం నిజంగా అరుదైన విషయమే. ఈ అక్కాచెల్లెలు ఇప్పటిలానే ఎప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉండాలని నిండు మనసుతో కోరుకుందాం. పెళ్లి తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్న ఈరోజుల్లో శ్రీలక్ష్మి, శ్రీప్రియ భర్తలు కూడా అక్కాచెల్లెళ్లను అర్థం చేసుకుని వాళ్ల బంధానికి ఇంతగా విలువనివ్వడం గొప్ప విషయమే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kerala, Mother, Trending, VIRAL NEWS