ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly ) లో చోటుచేసుకున్న ఘటనలపై, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యల ఉదంతంపై నందమూరి వారసుడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు. భువనేశ్వరిని బాదపెట్టిన వైసీపీ నేతలుగా నందమూరి కుటుంబీకులు ఆరోపించిన పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ కు ఆప్తులైన కొడాలి నాని, వల్లభనేని వంశీలు కూడా ఉండటంతో ఆయన ప్రతిస్పందనకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా, దూషణకు గురైన బాధితురాలి కుటుంబీకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగానే తానీ మాటలు చెబుతున్నానంటూ వైసీపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జూనియర్. టీడీపీకి సారధ్యం వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు, అభిమానులు తరచూ ఆందోళనలకు దిగుతోన్న దరిమిలా నారా భువనేశ్వరి ఉదంతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి స్పందించారు. అదే సమయంలో తన ఆప్తులు వంశీ, నాని పేర్లను కూడా ఆయన ప్రస్తావించలేదు.
ఆ నలుగురు వైసీపీ నేతలపై..
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారంటూ నందమూరి కుటుంబీకులు ఇవాళ కొందరు నేతల పేర్లను ప్రస్తావించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంట్లో శనివారం జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, భువనేశ్వరి మరో సోదరుడు రామకృష్ణ.. వైసీపీ నేతలైన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, వల్లభనేని వంశీల పేర్లను ప్రస్తావించారు. ఆ నలుగురూ భువనేశ్వరిని అవమానించేలా మాట్లాడారని, ఇకపైనా ఇది కొనసాగితే విశ్వరూపం చూపిస్తామని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ మరోఅడుగు ముందుకేసి.. ఇంకోసారి తన ఫ్యామిలీ జోలికొస్తే మెడలు విరగ్గొడతానని వైసీపీ నేతలను హెచ్చరించారు. వీరి ప్రెస్ మీట్ ముగిసిన కాసేపటికే నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. భువనేశ్వరి ఉదంతంలో జగన్ సర్కారు తీరును తీవ్రంగా తప్పుపుడుతూ సాగిన ఆ వీడియోలో జూనియర్ పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
అరాచక పాలనకు నాంది..
‘అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. అవి ప్రజా సమస్యలపై జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన నా మనసును కలచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజాసమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో, ముఖ్యమంగా మన ఆడపడుచుల గురించి పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పానలకు నాంది పలుకుతుంది. స్త్రీజాతిని గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవ నాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం. దాన్ని రాబోయే తరాలకు జాగ్రత్తగా అందించాలి. అంతేకానీ,
ఫ్యామిలీ వ్యక్తిగా కాదు..
మన సంస్కృతిని కలచివేసి, కాల్చేసి, ఇదే రాబోయే తరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పుు. ఈ మాటలు నేను ఒక వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబానికి చెందినవాడినిగా మాట్లాడటం లేదు. ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి చెందిన పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు ఒకటే విన్నపం. ఈ అరాచక సంస్కృతిని ఇక్కడే ఆపేయండి. ప్రజాసమజ్యలపై పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా నడవడిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటున్నాను..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగంగా మాట్లాడారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, Chandrababu Naidu, Jr ntr, Nandamuri Family, Nara Bhuvaneshwari, NTR, TDP, Ysrcp