దేశ చరిత్రలో తొలిసారిగా ప్రముఖుల భద్రత కోసం సుశిక్షిత మహిళా కమాండోలను రంగంలోకి దించనున్నారు. వీవీఐపీలకు భద్రత విషయంలో ఆ మధ్య సంచలన మార్పులు చేసిన మోదీ సర్కార్.. ఒక్క ప్రధానమంత్రికి మాత్రమే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) భద్రత ఉండాలని, ఇన్నాళ్లూ ఆ హోదా(ఎస్పీజీ భద్రత) పొందినవాళ్ల బాధ్యతను సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) చేపడుతుందని నిబంధనల్ని సవరించడం తెలిసిందే. కొంతకాలంగా ఆ ఆదేశాలు అమలవుతోన్న క్రమంలో తాజాగా వీఐపీల భద్రతకు మహిళా కమాండోలను నియమించనుంది. మహిళా కమాండోలు భద్రత కల్పించనున్న వీఐపీల జాబితాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గాంధీ పరివారం కూడా ఉండటం గమనార్హం.
వీఐపీల భద్రత కోసం ఇప్పుడు కొత్తగా మహిళా కమాండోలను కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. వీఐపీ భద్రత కోసం శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలను త్వరలో హోంమంత్రి అమిత్ షాతో సహా ఢిల్లీలో ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు నియమించనున్నారు. పర్యటనలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కూడా సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా విధులు నిర్వహించనున్నారు.
తొలిసారిగా సీఆర్పీఎఫ్ 32 మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. 10 వారాలు శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా నియమించనున్నారు. మహిళా కమాండోలకు ప్రత్యేక ఆయుధాలు అందుబాటులో ఉంటాయి. జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.
జెడ్ ప్లస్ భద్రత ఉన్న వారికీ మహిళా కమోండోలను రొటేషన్ పద్ధతిలో నియమించనున్నట్లు తెలుస్తోంది. రానున్న నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనవరి నుంచే సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు వీఐపీలకు సెక్యూరిటీగా అందుబాటులోకి రానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, CRPF, Rahul Gandhi, Security, Women